Orange Cap IPL 2024: ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లి మ‌రోసారి టాప్ ప్లేస్‌లోకి వ‌చ్చాడు. ఇటీవ‌లే ల‌క్నోపై సెంచ‌రీతో రుతురాజ్ గైక్వాడ్… కోహ్లికి చేరువ‌గా వ‌చ్చాడు. దాంతో విరాట్ నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌కు ముప్పు త‌ప్ప‌ద‌ని అభిమానులు భావించారు. కానీ స‌న్‌రైజ‌ర్స్‌పై హాఫ్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టిన కోహ్లి ఫ‌స్ట్ ప్లేస్‌లో మ‌రింత ముందుకు దూసుకెళ్లాడు.

430 ర‌న్స్‌…

ప్ర‌స్తుతం ఐపీఎల్ 2024లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 145 స్ట్రైక్ రేట్, 61 యావ‌రేజ్‌తో 430 ర‌న్స్ చేశాడు. ఇందులో ఓ సెంచ‌రీతో పాటు మూడు హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. గురువారం స‌న్‌రైజ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కోహ్లి 43 బాల్స్‌లో నాలుగు ఫోర్లు ఓ సిక్స‌ర్‌తో 51 ర‌న్స్‌తో రాణించాడు. కోహ్లితో పాటు ర‌జ‌త్ పాటిదార్ కూడా హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో స‌న్‌రైజ‌న్స్‌పై 35 ప‌రుగుల తేడాతో బెంగ‌ళూరు విజ‌యం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లి నెమ్మ‌దిగా బ్యాటింగ్ చేయ‌డంపై అభిమానుల‌తో పాటు మాజీ క్రికెట‌ర్లు విమ‌ర్శిస్తోన్నారు.

రుతురాజ్ సెకండ్ ప్లేస్‌…

ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లి త‌ర్వాత చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సెకండ్ ప్లేస్‌లో కొన‌సాగుతోన్నాడు. ఎనిమిది మ్యాచుల్లో 349 ర‌న్స్ చేశాడు రుతురాజ్ గైక్వాడ్‌. ఈ సీజ‌న్‌లో ఓ సెంచ‌రీతో పాటు రెండు హాఫ్ సెంచ‌రీల‌తో ప‌రుగులు వ‌ర‌ద‌ల పారిస్తున్నాడు రుతురాజ్‌. కోహ్లికి రుతురాజ్ నుంచే ముప్పు ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోంది.

గుజ‌రాత్‌పై మెరుపు ఇన్నింగ్స్‌…

గుజ‌రాత్ టైటాన్స్‌పై మెరుపు ఇన్నింగ్స్‌తో అనుహ్యంగా ఆరెంజ్ క్యాప్ రేసులోకి వ‌చ్చాడు ఢిల్లీ కెప్టెన్ రిష‌బ్ పంత్‌. ఈ మ్యాచ్‌లో 43 బాల్స్‌లోనే 88 ర‌న్స్ చేసిన పంత్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఢిల్లీకి విజ‌యాన్ని అందించాడు. ఈ ఐపీఎల్‌లో పంత్ ఇప్ప‌టివ‌ర‌కు 342 ప‌రుగులు చేశాడు. రోడ్డు యాక్సిడెంట్ కార‌ణంగా ఏడాదికిపైనే క్రికెట్‌కు దూరంగా ఉన్న రిష‌బ్ పంత్ ఐపీఎల్‌తోనే క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీలో అద‌ర‌గొట్టిన పంత్ ఐపీఎల్ ప్ర‌ద‌ర్శ‌న‌తో టీమిండియాలో చోటు ద‌క్కించుకోవ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.

సాయిసుద‌ర్శ‌న్ నాలుగో స్థానం…

కోహ్లి, రుతురాజ్‌, పంత్ త‌ర్వాత ఆరెంజ్ క్యాప్ రేసులో గుజ‌రాత్ హిట్ట‌ర్ సాయి సుద‌ర్శ‌న్ నాలుగో స్థానంలో ఉన్నాడు. సాయిసుద‌ర్శ‌న్ 9 మ్యాచుల్లో 334 ప‌రుగులు చేశాడు. 325 ప‌రుగుల‌తో ట్రావిస్ హెడ్ ఐదో స్థానంలో నిల‌వ‌గా…318 ప‌రుగుల‌తో రియాన్ ప‌రాగ్ ఆరో స్థానంలో ఉన్నాడు.

నలుగురు ఇండియన్స్…

ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ ఫైవ్‌లో న‌లుగురు ఇండియ‌న్ ప్లేయ‌ర్లే ఉండ‌గా ట్రావిస్ హెడ్ ఒక్క‌డే ఫారిన్ ప్లేయ‌ర్ కావ‌డం గ‌మ‌నార్హం. కాగా కోహ్లి ఫామ్‌లో ఉన్న ఆర్‌సీబీ మాత్రం వ‌రుస ఓట‌ముల‌తో ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్ర‌మించింది. ఇప్ప‌టివ‌ర‌కు తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన ఆర్‌సీబీ ఏడు ఓట‌ములు, రెండు విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో లాస్ట్ ప్లేస్‌లో కొన‌సాగుతోంది.

2016 సీజ‌న్‌లో 973 ప‌రుగులు చేసిన కోహ్లి ఆ ఏడాది ఆరెంజ్ క్యాప్ విన్న‌ర్‌గా నిలిచాడు. ఒకే సీజ‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన క్రికెట‌ర్‌గా రికార్డ్ నెల‌కొల్పాడు. అత‌డి రికార్డ‌ను ఇప్ప‌టివ‌ర‌కు ఏ క్రికెట‌ర్ బ్రేక్ చేయ‌లేక‌పోయాడు.