Prathinidhi 2 Postponed: ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు డైరెక్ట్ చేసిన మూవీ ప్రతినిధి 2. ఈ సినిమాలో నారా రోహిత్ నటించాడు. అతని కమ్‌బ్యాక్ మూవీ అయిన ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. నిజానికి ఈ మూవీ గురువారం (ఏప్రిల్ 25) ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా.. రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు మంగళవారం (ఏప్రిల్ 23) మేకర్స్ అనౌన్స్ చేశారు.

ప్రతినిధి 2 వాయిదా

నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 మూవీ రిలీజ్ కు అంతా సిద్ధమై ప్రమోషనల్ వీడియోలు కూడా రిలీజ్ చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం మూవీని వాయిదా వేస్తున్నట్లు చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు. “ఏప్రిల్ 25 నుంచి ప్రతినిధి 2 మూవీ వాయిదా పడింది. కొత్త రిలీజ్ తేదీని త్వరలోనే అనైన్స్ చేస్తాం” అనే మెసేజ్ తో కొత్త పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.

మూవీ రిలీజ్ వాయిదా పడటానికి కారణమేంటన్నది మాత్రం తెలియలేదు. ఏపీలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ ప్రతినిధి 2 మూవీ ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. సినిమాను కూడా మేకర్స్ బాగానే ప్రమోట్ చేశారు. కానీ చివరి నిమిషంలో రిలీజ్ వాయిదా ప్రేక్షకులను అసంతృప్తికి గురి చేస్తోంది. ఈ సినిమాను కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, సురేందర్‌నాథ్ బొల్లినేని సంయుక్తంగా నిర్మించారు.

ప్రతినిధి 2 ట్రైలర్

ప్రతినిధి 2 మూవీ ట్రైలర్ ను ఈ మధ్యే రిలీజ్ చేశారు. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ ఈ ట్రైలర్ లాంచ్ చేయడం విశేషం. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. గాంధీ చనిపోయినప్పుడు ఎంతమంది గుండెపోటుతో మరణించారన్న హీరో ప్రశ్నతో ఈ ట్రైలర్ మొదలైంది. నాలుగు సంక్షేమ పథకాలు అందించిన ఓ రాజకీయ నాయకుడు ముఖ్యమా మీ కుటుంబమా అన్న ప్రశ్న కూడా ఆసక్తి రేపేలా ఉంది.

రాజ‌కీయ వ్యవ‌స్థలోని అవినీతిని ప్రశ్నిస్తూ మూర్తి దేవగుప్తపు ఒక పవర్ ఫుల్ కథను రాశారు. కథానాయకుడి అసలు పాత్రను వెల్లడించకుండా ట్రైలర్‌లో సినిమా గురించి మరింత సమాచారం ఉంది. నారా రోహిత్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. సిరీ లెల్లా కథానాయికగా నటించింది. సచిన్ ఖేడేకర్, దినేష్ తేజ్, రఘుబాబు, జిషు సేన్‌గుప్తా, పాపులర్ యాంకర్ ఉదయ భాను, అజయ్ ఘోష్ , శ్రీ ముఖ్య పాత్రల్లో కనిపించారు.

సినిమాటోగ్రాఫర్ నాని చమిడిశెట్టి, సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్, ఎడిటర్ రవితేజ గిరిజాల క్యాలిటీ కంటెంట్‌ను అందించడానికి అద్భుతమైన టీం వర్క్ అందించారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. మూవీ ట్రైలర్ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న ఉత్కంఠను మరింత పెంచింది.

ఏపీలో ఎన్నికల వేల పొలిటికల్ డ్రామా మూవీస్ తరచూ వస్తూనే ఉన్నాయి. వ్యూహం, శపథం, యాత్ర 2లాంటి సినిమాలు ఇప్పటికే వచ్చాయి. ఇక ఎన్నికలకు ముందు ప్రస్తుతం అక్కడ ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు భావిస్తున్న ఈ ప్రతినిధి 2 మూవీ మరింత హీటు పెంచనుందని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో మేకర్స రిలీజ్ వాయిదా వేశారు.