Yuzvendra Chahal RCB : ఐపీఎల్​ 2024లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు.. తన చెత్త ప్రదర్శనతో అందరిని నిరాశపరుస్తోంది. 8 మ్యాచుల్లో 7 ఓటములతో.. టేబుల్​ బాటమ్​లో స్థిరపడింది. ఇదే కొనసాగితే.. ఆర్సీబీ ఈ సీజన్​ని చివరి స్థానంలోనే ముగించే అవకాశం ఉంది. విరాట్​ కోహ్లీ ఆరెంజ్​ క్యాప్​ మినహా.. ఆ జట్టుకు పెద్దగా ప్లస్​ పాయింట్లు కనపడటం లేదు. అదే సమయంలో.. ఆర్సీబీ మాజీ ప్లేయర్​, ప్రస్తుత రాజస్థాన్​ రాయల్స్​ స్పిన్నర్​ యుజ్వెందర్​ చాహల్​.. ఐపీఎల్​ 2024లో దుమ్మురేపుతున్నాడు. చాహల్​ని వదులుకుని ఆర్సీబీ ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థమవుతోంది. అందుకే.. అతడిని వెనక్కి తెచ్చుకోవాలని చాలా మంది డిమాండ్​ చేస్తున్నారు. ఆ జాబితాలో.. మాజీ క్రికెటర్​, ఆర్సీబీ మాజీ ప్లేయర్​ రాబిన్​ ఊతప్ప కూడా చేరాడు.

‘చాహల్​ని వెనక్కి తెచ్చుకోండి..’

ముంబై ఇండియన్స్​తో జరిగిన ఆర్​ఆర్​ మ్యాచ్​లో తన 200వ వికెట్​ తీశాడు చాహల్​. ఐపీఎల్​ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్​గా నిలిచాడు. కాగా.. 2022లో చాహల్​ని ఆర్సీబీ వదులుకుంది. ఆర్సీబీ తరఫున 8 సీజన్లు ఆడిన అతను.. 113 మ్యాచుల్లో 139 వికెట్లు పడగొట్టాడు. ఇంతటి ప్రతిభావంతమైన బౌలర్​ని ఆర్సీబీ ఎందుకు వదులుకుందో! ఏదేమైనా.. చాహల్​ లేని లోటు స్పష్టం కనిపిస్తోంది. 2022 నుంచి రాజస్థాన్​ రాయల్స్​కు ఆడిన 28 మ్యాచుల్లో చాహల్​లో 60కిపైగా వికెట్లు తీశాడు.

Yuzvendra Chahal IPL : ఈ నేపథ్యంలో.. చాహల్​ని ఆర్సీబీ వదులుకోవడాన్ని ఊతప్ప తప్పుపట్టాడు. ఐపీఎల్​ గెలవాలంటే.. చాహల్​ని వెనక్కి తెచ్చుకోవాలని సూచించాడు.

“నేనైతే ముందు యుజ్వెందర్​ చాహల్​ దగ్గరికి వెళతాను. ఆర్సీబీకి తిరిగి రావాలని అడుగుతాను. అతడి కోసం ఏదైనా చేస్తాను. వెనక్కి తెచ్చుకోవడానికి ఎంత దూరమైన వెళతాను. అంతేకాదు.. హర్షల్​ పటేల్​ దగ్గరికి కూడా వెళతాను. వెనక్క రమ్మని అడుగుతాను. ఆర్సీబీ బ్యాటింగ్​ లైనప్​ని చూడండి.. ఫాఫ్​ డూప్లెసిస్​, విరాట్​ కోహ్లీ, గ్లెన్​ మ్యాక్స్​వెల్​, దినేశ్​ కార్తిక్​. మరి బౌలర్లు? ఆర్సీబీకి గొప్ప బ్యాటర్లు ఉన్నారు. ఏబీ డివిలియర్స్​, క్రిస్​ గేల్​, ట్రావిస్​ హెడ్​, షేన్​ వాట్సన్​.. ఇలా చాలా మంది ఆడారు,” అని టీఆర్​ఎస్​ ఇంటర్వ్యూలో చెప్పాడు ఊతప్ప.

IPL 2024 latest news : చాహల్​ ఒక్కడే కాదు.. చాలా మంది ప్రతిభావంతమైన ప్లేయర్లను వదులుకుంది ఆర్సీబీ. వారందరు వేరే ఫ్రాంఛైజ్​లకు వెళ్లి సత్తా చాటారు. ఆర్సీబీ తరఫున 15 మ్యాచ్​లు ఆడిన శివమ్​ దూబే.. 169 పరుగులు చేశాడు. ఆ తర్వాత సీఎస్కేకి వెళ్లిపోయాడు. దేవ్​దత్​ పడిక్కల్​ కూడా.. 2020లో ఆర్సీబీ తరఫున సత్తా చాటి.. ఎమర్జింగ్​ ప్లేయర్​ అవార్డును కూడా పొందాడు. తన మొదటి ఐపీఎల్​లోనే 400కుపైగా రన్స్​ చేసిన రెండో అన్​క్యాప్ట్​డ్​ ఇండియా ప్లేయర్​గా నిలిచాడు. కానీ.. అతడిని కూడా ఆర్సీబీ వదులుకుంది. ప్రస్తుతం సన్​రైజర్స్​ హైదరాబాద్​లో దుమ్మురేపుతున్న హెన్రిక్​ క్లాసెన్​, అభిషేఖ్​ శర్మలు కూడా గతంలో ఆర్సీబీకి ఆడినవారే!

“ఇప్పుడు డొమెస్టిక్​ ప్లేయర్స్​ విషయానికి వద్దాము. నన్ను, మనీశ్​ పాండే, కరుణ్​నాయర్​, మయాంక్​ అగర్వాల్​, దేవ్​దత్​ పడిక్కల్​.. అందరిని ఆర్సీబీ వదిలేసింది. విరాట్​ కోహ్లీ తర్వాత.. అత్యధిక పరుగులు సాధించిన ఇండియన్​ ప్లేయర్​ రాహుల్​ ద్రవిడ్​. క్రేజీ కదా! ఇక్కడే అర్థమైపోతోంది. విరాట్​ కోహ్లీ ఎలాగైనా పరుగులు చేస్తాడు. కానీ దానిని కట్టడి చేసే వారు కూడా ఉండాలి కదా. 2012, 2014లో కేకేఆర్​ గెలిచినప్పుడు.. స్కోర్​ 170 మాత్రమే. పరుగులు చేయడానికి కష్టపడాలి. బౌలింగ్​ అలా ఉండాలి. ఆర్సీబీకి అది చేతకాదు. బౌలింగ్​, మిడిల్​ ఆర్డర్​పై ఎక్కువ ఇన్​వెస్ట్​ చేయాలి. వారితో జర్నీ చేయాలి. వారిపై నమ్మకం ఉంచాలి. ఆర్సీబీ తరఫున ఆడిన ప్లేయర్లు.. ఈ ఒక్క ఐపీఎల్​లోనే 25మంది ఉన్నారు!” అని ఊతప్ప చెప్పుకొచ్చాడు.