ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రస్తుత 2024 సీజన్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ పేలవంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ సీజన్ కోసం వేలంలో ఏకంగా రూ.24.75 కోట్ల భారీ ధరతో ఆస్ట్రేలియా పేసర్ స్టార్క్‌ను కోల్‍కతా కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా అతడు రికార్డు సృష్టించాడు. అయితే, తొమ్మిదేళ్ల తర్వాత ఐపీఎల్‍లో అడుగుపెట్టిన స్టార్క్ ఈ సీజన్‍లో బౌలింగ్‍లో ఏ మాత్రం అంచనాలను అందుకోలేకున్నాడు. భారీగా పరుగులు ఇస్తూ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు.

ఈ సీజన్‍లో తొలి రెండు మ్యాచ్‍ల్లో ఏకంగా 100 పరుగులు సమర్పించుకున్న మిచెల్ స్టార్క్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇప్పటి వరకు ఈ సీజన్‍లో ఏడు మ్యాచ్ కేవలం ఆరు వికెట్లే పడగొట్టాడు. కీలక సమయాల్లో భారీగా పరుగులు ఇచ్చిన స్టార్క్ ఏకంగా 11.48 ఎకానమీతో ఉన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఏప్రిల్ 21న జరిగిన చివరి ఓవర్లోనూ మూడు సిక్సర్లు సమర్పించాడు. అయితే, ఒక్క రన్ తేడాతో కోల్‍కతా గెలిచింది. దీంతో, ఇంటర్నేషనల్ స్టార్ బౌలర్ స్టార్క్ ఇలాంటి ప్రదర్శన చేస్తుండడంపై ఆశ్చర్యం వక్తమవుతోంది. అతడికి అంత భారీ ధర వేస్ట్ అయిందంటూ కొందరు విమర్శిస్తున్నారు. అయితే, ఈ విషయంపై తాజాగా స్పందించారు కోల్‍కతా ఫ్రాంచైజీ ఓనర్ వెంకీ మైసూర్.

అతడో సూపర్ స్టార్

ఈ సీజన్‍లో ఇప్పటి వరకు అంచనాలను ఏ మాత్రం అందుకోకపోయినా.. మిచెల్ స్టార్క్‌కు మద్దతుగా మాట్లాడారు కోల్‍కతా నైట్‍రైడర్స్ యజమాని వెంకీ మైసూర్. స్టార్క్ ఓ సూపర్ స్టార్ అని.. క్వాలిటీ ప్లేయర్ అని ఓ ఈవెంట్‍లో పాల్గొన్న ఆయన చెప్పారు. స్టార్క్ వల్ల జట్టుకు చాలా అదనపు వాల్యూ యాడ్ అవుతోందని తాము భావిస్తున్నట్టు చెప్పారు.

అది ఆటగాడి చేతిలో ఉండదు

మిచెల్ స్టార్క్ రావడంతో కోల్‍కతా జట్టుకు అదనపు బలం చేకూరిందని వెంకీ మైసూర్ చెప్పారు. వేలంలో ధర అనేది ప్లేయర్ చేతిలో ఉండదు కదా అని అన్నారు. “పెట్టుబడి దృక్పథంలో మేం దాన్ని (స్టార్క్ విషయాన్ని) ఆలోచించడం లేదు. వేలంలో జరిగేది ప్లేయర్ల చేతిలో ఉండదు. అలాగే మరెవరి చేతుల్లోనూ ఉండదు” అని వెంకీ అన్నారు.

మిచెల్ స్టార్క్ ఉంటే జట్టుకు అదనంగా మరింత విలువ యాడ్ అవుతుందని తాము అనుకున్నామని, అది జరుగుతోందని వెంకీ మైసూర్ అన్నారు. సపోర్టింగ్ స్టాఫ్ కోరుకునే అన్ని స్కిల్స్.. మిచెల్ స్టార్క్ వద్ద ఉన్నాయని ఆయన అన్నారు. మొత్తంగా స్టార్క్‌కు ఆయన మద్దతుగా మాట్లాడారు.

ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‍ల్లో ఐదు గెలిచిన కోల్‍కతా నైట్‍రైడర్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.