World Malaria Day: ప్రతి ఏడాది ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. దోమల వల్ల వచ్చే ఈ మలేరియా ఒక అంటు వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో మలేరియా వ్యాపిస్తూనే ఉంది. ముఖ్యంగా ఆఫ్రికా దేశంలోనే మలేరియా వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఆఫ్రికా దేశాలలో మలేరియా సోకిన వారిలో చాలామంది మరణిస్తున్నారు.

మలేరియా ఒక అంటు వ్యాధని ముందే చెప్పుకున్నాం. మలేరియా బారిన పడిన వారిని కుట్టిన దోమ మనల్ని కుడితే ఆ జ్వరం వచ్చేస్తుంది. అనాఫిలిస్ జాతికి చెందిన ఆడ దోమల్లో ప్లాస్మోడియం వైవాక్స్ అనే ప్రోటోజోవా ఉంటుంది. దానివల్లే మనకి మలేరియా వస్తుంది. వేసవిలో, వానాకాలంలో మలేరియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి.

క్లాస్మోడియం వైవాక్స్ అనేది ఒక పరాన్న జీవి. ఇది మన శరీరంలో చేరాక నేరుగా కాలేయంపై దాడి చేస్తుంది. రక్త కణాలలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. సరైన సమయంలో మలేరియాను గుర్తించి చికిత్స అందించాలి. ఆలస్యం చేస్తే ప్రాణాంతకంగా మారుతుంది.

మలేరియాను కలిగించే ప్లాస్మోడియం పరాన్న జీవులు ఐదు రకాలుగా ఉంటాయి. వాటిలో ఏది శరీరంలో చేరిన మలేరియా వచ్చే అవకాశం ఉంది.

చెమట పట్టే వారికి

దోమలు కొన్ని రకాల వాసనలను ఇష్టపడతాయి. ఎక్కువగా చెమట పట్టే వారిని దోమలు కుట్టే అవకాశం ఎక్కువ. అలాగే ఒక వ్యక్తి నుంచి కార్బన్ డయాక్సైడ్ వాసన వస్తున్నా, లాక్టిక్ యాసిడ్ వాసన వస్తున్న కూడా దోమలు ఆ మనుషులని కుట్టే అవకాశం ఉంది. భూమిపై ఉన్న జీవుల్లో మనుషులకు ఎక్కువగా వ్యాధులు సోకేలా చేసే జీవులు దోమలే. వీటివల్ల మలేరియా మాత్రమే కాదు డెంగ్యూ, జికా వైరస్, టైఫాయిడ్ వంటి అనేక జ్వరాలు వచ్చే అవకాశం ఉంది.

దోమల జీవితకాలం చాలా తక్కువ. కొన్ని వారాలు మాత్రమే బతుకుతాయి. కానీ ఆ కొన్ని వారాల్లోనే వందల గుడ్లు పెట్టి తమ సంతతిని చాలా వేగంగా పెంచుతాయి. దోమలు ఉదయం పూట యాక్టివ్ గా ఉండవు. వాతావరణం చల్లగా అవుతున్న కొద్ది, రాత్రి అవుతున్న కొద్దీ ఇవి యాక్టివ్ గా మారుతాయి. అప్పుడే ఎక్కువగా మనుషుల్ని కుడతాయి.

ఈ భూమిపై ఉన్న జీవుల్లో ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకునే శక్తి దోమలకు ఉంది. అందుకే అవి మూడు కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూమిపై జీవిస్తున్నాయి. మనుషులకు పెద్ద సమస్యగా మారిన జీవులు ఈ దోమలే.

మలేరియా రాకుండా అడ్డుకునేందుకు ఎటువంటి టీకాలు లేవు. దోమలు కుట్టకుండా మనల్ని మనం కాపాడుకోవడమే. ముఖ్యంగా ఇంట్లో నీరు నిలవ లేకుండా చూసుకోవాలి. చుట్టుపక్కల మురుగు కాలవలు లేకుండా జాగ్రత్తపడాలి. ఒకవేళ మురుగు కాలువలు ఉంటే డిడిటి పౌడర్ వంటివి చల్లుకోవాలి. దోమలు ఇంట్లోకి రాకుండా కిటికీలకు, జాలీలు వంటివి వాడాలి. కలుషిత నీరును దూరంగా ఉంచాలి.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ 20 కోట్ల మంది ఈ మలేరియా బారిన పడుతున్నారు. వారిలో సగం మంది వరకు మరణిస్తున్నారు. కాబట్టి మలేరియాను తేలికగా తీసుకోకూడదు.

మనదేశంలో 2018 నివేదిక ప్రకారం 98% మందికి మలేరియా వచ్చే అవకాశం ఉంది. కాస్త నిర్లక్ష్యం చేసిన వారు దోమ కాటుకు గురై మలేరియా బారిన పడతారు. దోమలు ఎక్కువగా ఉండే చోట నివసిస్తున్న వారు శరీరాన్ని కప్పేలా దుస్తులు ధరించాలి. దోమ కాటును నివారించే క్రీములు శరీరానికి రాసుకోవాలి. దోమతెరలు కట్టుకోవాలి. సాయంత్రం అయ్యేసరికి కిటికీలు, తలుపులు మూసేయడం మంచిది.