Lord hanuman: హనుమంతుడికి శ్రీరాముడు అంటే అమితమైన ప్రేమ అనే విషయం అందరికీ తెలుసు. అయితే ఒకసారి శ్రీరాముడు స్వయంగా హనుమంతుడికి మరణశిక్ష విధించాడు.

ఒకసారి అయోధ్యలో నారదుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు కలుసుకున్నారు. రామనామం కంటే రాముడు బలవంతుడని అనుకుంటూ దాని గురించి వాళ్ళు చర్చించుకున్నారు. రామ నామం నిజంగా రాముడు కంటే బలంగా ఉందని నారద మహర్షి పేర్కొన్నాడు. దానిని నిరూపించాలని నిర్ణయించుకున్నాడు. అయితే విశ్వామిత్రుడిని తప్ప హనుమంతుడు రుషులందరినీ గౌరవించాడు. దీంతో కోపోద్రిక్తుడైన విశ్వామిత్రుడు రాముడి వద్దకు వెళ్లి హనుమంతుడు క్షమించరాని ప్రవర్తనకు మరణశిక్ష విధించాలని కోరాడు.

హనుమంతుడికి మరణశిక్ష

విశ్వామిత్రుడు రాముడికి గురువు. అందువల్ల ఆయన ఆదేశాలను తిరస్కరించలేకపోయాడు. హనుమంతుడికి మరణశిక్ష విధించాడు. అయితే రాముడు తన ప్రాణం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాడో తెలియక హనుమంతుడు అయోమయంలో పడ్డాడట. అప్పుడు నారదుడు చింతించవద్దని చెబుతూ రామనామం జపిస్తూ ఉండమని సూచిస్తాడు.

రాముడు హనుమంతుడి మీదకు తన బాణాలను ఒకదాని తర్వాత ఒకటి ప్రయోగించాడు. కానీ హనుమంతుడి శరీరం మీద ఒక గీత కూడా పడలేదు. రాముడు బాణాలు ప్రయోగిస్తున్నంత సేపు హనుమంతుడు రామ నామాన్ని జపిస్తూ ఉండటం వల్ల బాణాలు ఒక్కటి కూడా అతని శరీరానికి తగలకుండా ఉన్నాయి. నారదుడి ఉపాయం తెలుసుకున్న రాముడు ఆగిపోతాడు. అలా రామనామం భగవంతుని కంటే గొప్పదని రుజువైంది.

సీతమ్మ ఇచ్చిన బహుమతి వద్దన్న హనుమంతుడు

హనుమంతుడు సీతారాముల వారికి తన గుండెల్లో గుడి కట్టుకున్నాడు. అటువంటి సీతమ్మ తల్లి ఇచ్చిన ఒక బహుమతిని హనుమంతుడు తిరస్కరించాడు. ఒకరోజు సీతాదేవి హనుమంతుడికి అందమైన ముత్యాల హారాన్ని బహుమతిగా ఇచ్చిందంట. కానీ అతను దాన్ని తిరస్కరించాడు. రాముడు పేరు లేనిది ఏది తనకు ఉపయోగపడదని చెప్పాడట. రాముడు సీతాదేవి పట్ల తనకున్న ప్రేమను నిరూపించుకోవడానికి వారిద్దరూ తన హృదయంలో ఎల్లప్పుడూ ఉంటారని తన ఛాతీని చీల్చి చూపించాడు.

హనుమంతుడికి తీరని ఆకలి… రాముడు ఉపాయం

ఒకనాడు సీతామాత వాల్మీకి మహర్షి ఆశ్రమంలో నివసిస్తున్నప్పుడు హనుమంతుడు వచ్చాడట. అప్పుడు అతనికి సీతమ్మ తల్లి వంట చేసి పెట్టింది. భోజన ప్రియుడైన హనుమంతుడు వండిన ఆహార పదార్థాలన్నీ తిన్నాడు. కానీ తన ఆకలి మాత్రం తీరలేదు. ఇంట్లో ఉన్నవన్నీ అయిపోయాయి. కానీ అతను ఇంకా ఆకలితోనే ఉన్నాడట. నిరాశ చెందిన సీత శ్రీరాముడిని సహాయం కోసం ప్రార్థించింది. అప్పుడు హనుమంతుడికి వడ్డించే ఆహారంలో తులసి ఆకులు కలపమని రాముడు ఆమెకు సలహా ఇచ్చాడు. సీత అలా చేయడంతో హనుమంతుడి ఆకలి ఇట్టే తీరిపోయింది.

హనుమంతుడికి శాపం

ఎంతోమంది దేవతలు హనుమంతుడికి అనేకరకాల వరాలను ఇచ్చి ఆశీర్వదించాడు. అయితే తన కొత్త శక్తులను ఎలా నియంత్రించాలో హనుమంతుడికి తెలియక అడవిలో తపస్సు చేసుకుంటున్న రుషులను ఇబ్బంది పెట్టాడు. దీంతో కోపోద్రిక్తులైన రుషులు హనుమంతుడికి శాపం పెట్టారు. అతను తన శక్తులన్నింటినీ మర్చిపోతాడని, ఎవరైనా అతనికి గుర్తు చేస్తే మాత్రమే వాటిని గుర్తుంచుకోగలడని శాపం విధించారట. అలా హనుమంతుడికి శాపం ఉంది.