Vishwambhara Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం విశ్వంభర చిత్రం రూపొందుతోంది. ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రానికి బింబిసార ఫేమ్ డైరెక్టర్ బింబిసార దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‍తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన రిలీజ్ చేస్తామని ఇప్పటికే డేట్ కూడా ఫిక్స్ చేసేశారు మేకర్స్. అందుకే ఈ మూవీ షూటింగ్‍ను శరవేగంగా చేస్తున్నారు. కాగా, విశ్వంభర ఇంటర్వెల్ సీక్వెన్స్ షూటింగ్ జరిగింది.

ఇదే హైలైట్!

విశ్వంభర చిత్రంలో ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీకి ఇదే హైలైట్‍గా ఉండనుందని సినీ వర్గాల్లో టాక్. ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం 26 రోజుల పాటు షూటింగ్ జరిగింది. ఈ సీక్వెన్స్‌కు సంబంధించిన చిత్రీకరణ నేడు పూర్తయింది.

ఈ భారీ ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం 54 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని మూవీ టీమ్ ఏర్పాటు చేసింది. ఈ విగ్రహం ముందే ఇంట్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరిగింది. ఇంటర్వెల్ కోసమే 26 రోజుల పాటు చిత్రీకరణ జరిగింది. ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో మెగాస్టార్ చిరంజీవి ఫైట్స్ చూసేందుకు రెండు కళ్లు చాలవట. ఈ రేంజ్‍లో భారీగా ఉండేలా డైరెక్టర్ వశిష్ట అన్ని చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది. ఒక్క ఇంటర్వెల్ కోసమే 26 రోజుల పాటు షూటింగ్ చేయడంతో.. ఇండస్ట్రీలో ఇది ఓ కొత్త స్టాండర్డ్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.

ఇటీవలే ఈ విశ్వంభర ఇంటర్వెల్ సీక్వెన్స్ షూటింగ్ సెట్స్‌లోనే హీరో చిరంజీవిని కలిశారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. జనసేన పార్టీ కోసం పవన్‍కు రూ.5కోట్ల విరాళం కూడా ఇచ్చారు చిరూ. అప్పుడు.. హనుమంతుడి విగ్రహం ఉన్న ఈ షూటింగ్ లొకేషన్ ఫొటోలు బయటికి వచ్చాయి.

భారీ వీఎఫ్‍ఎక్స్‌తో..

సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా భారీ వీఎఫ్‍ఎక్స్‌తో విశ్వంభర చిత్రం ఉండనుంది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ నెక్స్ట్ లెవెల్‍లో ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. వీఎఫ్‍ఎక్స్ కోసమే భారీ ఖర్చు చేయనున్నారట మేకర్స్. సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‍తో విశ్వంభర చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది.

విశ్వంభర చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్‍గా త్రిష చేస్తున్నారు. సుమారు 18 సంవత్సరాల తర్వాత చిరూ, త్రిష కలిసి నటిస్తున్నారు. స్టాలిన్ తర్వాత మళ్లీ వారిద్దరు ఇప్పుడు జతకట్టారు.

విశ్వంభర మూవీకి ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగాయని తెలుస్తోంది. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‍లో ఐదు భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. ఈ చిత్రానికి సాయిమాధవ్ మాటలను అందిస్తుండగా.. చోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.

విశ్వంభర చిత్రం నుంచి గతంలో వచ్చిన కాన్సెప్ట్ వీడియోనే అద్భుతంగా అనిపించింది. హైక్వాలిటీ వీఎఫ్‍ఎక్స్‌తో వచ్చిన ఈ వీడియో ఈ మూవీపై అంచనాలను భారీ స్థాయిలో పెంచేసింది. ఫ్యాంటసీ యాక్షన్ జానర్లలోనే బింబిసారతో మంచి హిట్ కొట్టిన డైరెక్టర్ విశిష్ట.. విశ్వంభరను అంతకు మించి తెరకెక్కిస్తారనే ఎక్స్‌పర్టేషన్స్ మెండుగా ఉన్నాయి.