Teacher recruitment scam Bengal : పశ్చిమ్​ బెంగాల్​లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి షాక్​ ఇస్తూ.. 2016 టీచర్​ రిక్రూట్​మెంట్​ స్కామ్​ కేసులో సంచలన తీర్పును వెలువరించింది కోల్​కతా హైకోర్టు. మొత్తం 25,753 టీచర్ల ఉద్యోగాలను రద్దు చేసింది! అంతేకాదు.. ఇప్పటివరకు వారందరు తీసుకున్న వేతనాలను 12శాతం వడ్డీతో సహా తిరిగివ్వాలని తేల్చిచెప్పింది.

“ఓఎంఆర్​ షీట్లను నింపకుండా సబ్మీట్​ చేసి, అక్రమంగా టీచర్​ ఉద్యోగాన్ని సంపాదించిన వారందరు.. నాలుగు వారాల్లో, ఇప్పటివరకు తీసుకున్న జీతాలు తిరిగిచ్చేయాలి. టీచర్ల నుంచి డబ్బులు సేకరించే బాధ్యత జిల్లా మెజిస్ట్రేలకు అప్పగిస్తున్నాము,” అని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్​ దీబాంగ్షు బసక్​, జస్టిస్​ షబ్బర్​ రషిది నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాకుండా.. ఈ పూర్తి టీచర్​ రిక్రూట్​మెంట్​ ప్రక్రియకు సంబంధించిన నియమాక ప్రాసెస్​పై దర్యాప్తు చేపట్టాలని, 3 నెలల్లో రిపోర్టును సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.

ఇలా 25వేలకుపైగా ఉద్యోగాలను తొలగించినప్పటికీ.. మళ్లీ రిక్రూట్​మెంట్​ నిర్వహించాలని, సంబంధిత ప్రక్రియను త్వరగా మొదలుపెట్టాలని పశ్చిమ్​ బెంగాల్​ స్కూల్​ సర్వీస్​ కమిషన్​ను ఆదేశించింది కోల్​కతా హైకోర్టు.

Bengal Teacher recruitment scam 2016 : ఈ టీచర్​ రిక్రూట్​మెంట్​ స్కామ్​ కేసు.. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్​ కాంగ్రెస్​ను గత కొన్నేళ్లుగా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మాజీ మంత్రి పార్థ ఛటర్జీ సహా అనేక మంది టీఎంసీ నేతలు, ప్రభుత్వ అధికారులు.. ఇదే కేసులో జైలులో ఉన్నారు. ఇక టీచర్​ రిక్రూటమెంట్​ స్కామ్​పై కోల్​కతా హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పును.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు సవాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

తాజా తీర్పు తర్వాత.. టీచర్​ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కంట తడి పెట్టుకున్నారు. “ఇన్నేళ్లుగా.. ఇదే తీర్పు కోసం ఎదురుచూస్తున్నాము. మొత్తానికి మాకు న్యాయం జరిగింది,” అని కోల్​కతా హైకోర్టు ఎదుట సంబరాలు చేసుకున్నారు.

టీచర్​ రిక్రూట్​మెంట్​ స్కామ్​ 2016 వివరాలు..

24,640 పోస్టుల భర్తీ కోసం 2016 స్టేట్​ లెవల్​ సెలక్షన్​ టెస్ట్​ని నిర్వహించారు. 23 లక్షలకుపైగా మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. కాగా.. 25,753 అపాయింట్​మెంట్​ లెటర్లు జారీ అయ్యాయని పిటిషనర్లు చెబుతున్నారు. వీరిలో క్లాస్​ 9, 10, 11, 12, గ్రూప్​-సీ, గ్రూప్​-డీ సభ్యులు ఉన్నారన్నది ఆరోపణ.

Calcutta High court Teacher recruitment scam 2016 : ఇక ఈ స్కామ్​కు సంబంధించిన కేసుపై గత కొన్నేళ్లుగా కోల్​కతా హైకోర్టులో విచారణ జరుగుతోంది. డబ్ల్యూబీఎస్​సీసీ.. 2016లో ఏర్పాటు చేసిన బోర్డును గతేడాది తొలగించింది హైకోర్టు. అంతేకాదు.. 32వేలకుపైగా ప్రైమరీ టీచర్లు (వీరికి సరైన శిక్షణ లేదని) ను కూడా తొలగించింది. ఈ తీర్పును ఇచ్చిన జడ్జీ అభిజిత్​ గంగూలీకి టీఎంసీకి మధ్య మినీ యుద్ధమే జరిగింది. కొన్ని వారాల క్రితమే.. తన జడ్జి పదవికి రాజీనామా చేసిన అభిజిత్​ గంగూలీ.. బీజేపీ టికెట్​పై 2024 లక్​సభ ఎన్నికల్లో పోటీకి దిగారు.

అయితే.. గంగూలీ పాస్​ చేసిన తీర్పును.. మరో ధర్మాసనం హోల్డ్​లో పెట్టింది.