మార్కెట్ విలువ ప్రకారమే
ఏపీ అసైన్మెంట్ యాక్ట్-1977కు సవరణలు చేస్తూ రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీచేశారు. అసైన్డ్ భూములను ప్రభుత్వం తీసుకుంటే ఇతర భూముల యజమానులతో సమానంగానే మార్కెట్ ఆధారంగా పరిహారం చెల్లిస్తామని, ఈ విషయంలో సంప్రదింపులకు అవకాశం లేదని తెలిపింది. అయితే భూసేకరణ చట్టం-2013 ప్రకారం ప్రజాప్రయోజనాల కోసం భూముల్ని సేకరించినప్పుడు మార్కెట్ విలువ కంటే యజమానులు ఎక్కువ డిమాండ్ చేస్తే కలెక్టర్లు సంప్రదింపులు జరుపుతారు. ఇరువర్గాలకు ఆమోదమైన ధరను ప్రభుత్వం ప్రకటిస్తుంది. అయితే అసైన్డ్ భూముల విషయంలో ఈ తరహా అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ లో స్పష్టంచేసింది. ప్రభుత్వం పంపిణీ చేసిన సాగు భూములపై 20 ఏళ్లు, ఇంటి స్థలాలపై 10 సంవత్సరాల తర్వాత యాజమాన్య హక్కులు లభిస్తాయి. ఈ జాబితాల్ని స్థానిక ఎమ్మార్వో ప్రకటిస్తారని రెవెన్యూ శాఖ పేర్కొంది.