Anupama Parameswaran Paradha Title Glimpse: బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్ ఇటీవలే టిల్లు స్క్వేర్ సినిమాతో మంచి హిట్ కొట్టింది. ఈ సినిమాతో అనుపమ ఎంత బోల్డ్ అనేది చూపించింది. ఇప్పుడు ఆ బోల్డ్ ముద్రను చెరిపేసేలా సరికొత్త జోనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పరదా.

ఈ చిత్రాన్ని సినిమా బండి మూవీ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రెగుల తెరకెక్కిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ సిరీస్‌ల డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే నిర్మించిన సినిమా బండి మూవీతో ప్రశంసలు అందుకున్న ఆయన తన రెండవ చిత్రంతో మరో ఆకర్షణీయమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించనున్నారు. శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ నిర్మాతలుగా ఆనంద మీడియా తన తొలి నిర్మాణంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి గ్రాండ్ ఎంట్రీని ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు.

మహిళా కథానాయకుల చుట్టూ కేంద్రీకృతమై కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో వెరీ ట్యాలెంటెడ్ అనుపమ పరమేశ్వరన్, వెర్సటైల్ దర్శనా రాజేంద్రన్, సీనియర్ హీరోయిన్ సంగీత ప్రధాన పాత్రలు పోహిస్తున్నారు. ఎన్నో ప్రశంసలు పొందిన ‘హృదయం‘, ‘జయ జయ జయ జయ హే’ చిత్రాలతో పాపులరైన తర్వాత దర్శన రాజేంద్రన్ పరదా చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇది తెలుగు, మలయాళంలోని ఆమె అభిమానులకు ఉత్సాహాన్ని ఇస్తోంది.

తాజాగా సమంత, రాజ్ & డీకే పరదా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేశారు. ఆకట్టుకునే డ్రామాతో రూపొందుతున్న ఈచిత్రానికి “పరదా” అనే ఆసక్తికరమైన టైటిల్ లాక్ చేశారు. పరదా అంటే కర్టెన్. పరదా లేకుండా అనుపమ కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అనుపమ సాంప్రదాయ దుస్తులలో, వోనితో ముఖాన్ని కప్పి ఉంచే మరికొందరు అమ్మాయిలతో పాటు నిలబడి కనిపిస్తుంది.

ఇందులో అనుపమ తీక్షణంగా చూస్తూ కనిపించింది. ఆమె గత సినిమాలోలా కాకుండా డి-గ్లామ్ పాత్రలో కనిపించనుంది. కాన్సెప్ట్ వీడియో విలేజ్ సెటప్‌లో దేవత విగ్రహాన్ని చూపుతుంది. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా, యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రఫలాః క్రియా, మనుస్మృతిలోని ప్రసిద్ధ శ్లోకం బ్యాక్ గ్రౌండ్‌లో ప్లే అవుతుంది. దీని అర్ధం.. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో, అక్కడ దేవతలు పూజింపబడతారు. స్త్రీలు ఎక్కడ అవమానించబడతారో, ఎంత శ్రేష్ఠమైనప్పటికీ ఆ చర్యలు ఫలించవు. శ్లోకం సినిమా ఇతివృత్తాన్ని వివరిస్తుంది.

ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కొన్ని గ్రామాలలోని అద్భుతమైన ప్రదేశాలలో షూటింగ్ జరుపుకుంది. మేలో హైదరాబాద్‌లో చివరి దశ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసేందుకు టీమ్ రెడీగా ఉంది. ఈ చిత్రం గురించి దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల మాట్లాడుతూ.. “పరదాతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే కాకుండా లోతుగా ప్రతిధ్వనింపజేసే ఆకట్టుకునే కథనాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని తెలిపారు.

ఆనంద మీడియా బ్యానర్‌పై తెరకెక్కుతున్న “పరదా” ఆకర్షణీయమైన కథాంశం, ప్రతిభావంతులైన తారాగణం, ఆకట్టుకునే పాటలతో ప్రేక్షకులను అలరించనుంది. “మా సినిమా కథ మాత్రమే కాదు, ఒక అనుభవం, ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లే ప్రయాణం” అని నిర్మాత విజయ్ డొంకాడ ఆనందం వ్యక్తం చేశారు.

గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మృదుల్ సుజిత్ సేన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ధర్మేంద్ర కాకరాల ఎడిటర్. ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా విడుదలకు మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో మరిన్ని ఎగ్జయిటింగ్ అప్డేట్స్ ఇవ్వనున్నట్లు మేకర్స్ తెలిపారు.