Jr NTR furious: జూనియర్ ఎన్టీఆర్ కు ముంబైలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంటోంది. వార్ 2 మూవీ కోసం అతడు ఎప్పుడైతే అక్కడికి వెళ్లాడో అప్పటి నుంచీ తారక్ వెంట మీడియా పడుతూనే ఉంది. తాజాగా అలాగే తన వెంటే వీడియో తీస్తూ వస్తున్న ఓ ఫొటోగ్రాఫర్ పై అతడు తీవ్రంగా మండిపడ్డాడు. సహనం కోల్పోయిన ఎన్టీఆర్.. సదరు ఫొటోగ్రాఫర్ పై అరవడం వీడియోలో చూడొచ్చు.

తారక్ సీరియస్

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీలో నటించడానికి జూనియర్ ఎన్టీఆర్ ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీయే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ముంబైలో అడుగుపెట్టినప్పటి నుంచీ తారక్ కు ఈ ఫొటోలు, వీడియోల తాకిడి మొదలైంది. అతడు ఎక్కడికి వెళ్లినా వెంటపడుతున్నారు.

తాజాగా ఇలాగే ఓ ఫొటోగ్రాఫర్ వీడియో తీస్తూ తారక్ వెంటే వెళ్లాడు. అతని చుట్టూ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వారిస్తున్నా అతడు వినలేదు. మరీ దగ్గర వెళ్లడంతో తారక్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఆ సమయంలో మొబైల్లో మాట్లాడుతున్న జూనియర్ ఎన్టీఆర్.. మాట్లాడటం ఆపి ఓయ్.. వెనక్కి వెళ్లు అంటూ గట్టిగా అరవడం ఆ వీడియోలో కనిపిస్తోంది.

ఈ వీడియోను టోటల్ ఫిల్మీ అనే వెబ్‌సైట్ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేసింది. హోటల్లోకి వెళ్లే సమయంలో ఈ ఘటన జరిగింది. అప్పటికే ఫోన్లో ఎవరితోనూ తారక్ సీరియస్ గా మాట్లాడుతూ వెళ్తున్నాడు. బహుషా అతనికి ఆగ్రహానికి అది కూడా ఒక కారణం కావచ్చు. హైదరాబాద్ కంటే ముంబైలో అతనికి ఈ ఫొటోగ్రాఫర్ల తాకిడి ఎక్కువగా ఉంది.

తరచూ ఇలాంటివి జరుగుతుండటంతో ఎన్టీఆర్ సహనం కోల్పోతున్నాడు. గతంలో ఒకసారి ఇలాగే హైదరాబాద్ ఎయిర్ పోర్టులో తన కోసం ఎదురు చూస్తున్న ఓ ఫొటోగ్రాఫర్ తో.. నువ్వు ఎప్పుడూ ఇక్కడే ఉంటావా.. అన్ని పనులూ ఇక్కడే చేస్తావా అంటూ తారక్ అడగడం గమనార్హం. చాలా వరకు కెమెరా కంటికి దూరంగా ఉండటానికి తారక్ ఇష్టపడతాడు.

వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్

వార్ 2 మూవీతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా లెవల్లో అతనికి ఫాలోయింగ్ పెరిగింది. దీంతో వార్ 2 మూవీలో హృతిక్ రోషన్ కు విలన్ పాత్రలో ఇప్పుడు తారక్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో సాగుతోంది. ఈ మధ్యే సెట్స్ లో ఉన్న హృతిక్, తారక్ ఫొటోలు లీకయ్యాయి.

ఇక తెలుగులోనూ దేవర మూవీతో అతడు బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ లాంటి బాలీవుడ్ నటులు నటిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్లోనే రిలీజ్ కావాల్సి ఉన్నా.. దసరా పండగ సందర్భంగా రిలీజ్ కానుంది.