Vaishakha masam 2024: హిందూ నూతన సంవత్సరంలో వచ్చే రెండవ మాసం వైశాఖం. చైత్ర మాసం తర్వాత వస్తుంది. ఈ మాసంలో మహావిష్ణువు, సంపదల దేవత అయిన లక్ష్మీదేవిని పూజిస్తారు.

సనాతన ధర్మంలో వైశాఖ మాసానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది. గంగానది వంటి ఇతర పవిత్ర నదుల్లో స్నానం చేయడం ఈ మాసంలో శుభప్రదంగా భావిస్తారు. పరశురాముడిని, బంకే బిహారీలను పూజించడం వల్ల మనశ్శాంతి లభిస్తుందని, దుఃఖాలు తొలగిపోతాయని నమ్ముతారు.

వైశాఖ మాసం ప్రాముఖ్యత

విశాఖ నక్షత్రంతో సంబంధం కలిగి ఉండటం వల్ల ఈ మాసాన్ని వైశాఖంగా పిలుస్తారు. విశాఖ నక్షత్రానికి అధిపతి బృహస్పతి, ఇంద్రుడు .అందుకే ఈ మాసం అంతా స్నానం, ఉపవాసం, పూజలు చేయడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఈ మాసంలో పరుశురాముని జయంతి, అక్షయ తృతీయ, మోహినీ ఏకాదశి వంటి ముఖ్యమైన పండుగలు ఉన్నాయి.

స్కంద పురాణంలోనే వైశాఖ మాసం గురించి ప్రస్తావించారు. భగవంతుడి ఆరాధనకు, పరోపకారానికి, పుణ్యానికి ఇది అనువైన మాసం. అందుకే ఈ మాసంలో పక్షుల కోసం నీటి తొట్లు ఏర్పాటు చేయడం, చెట్లను రక్షించడం, జంతువులు పక్షులకు ధాన్యాలు నీరు అందించడం వంటి కార్యక్రమాలు చేయడం వల్ల సంతోషం, సంపద లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

మతవిశ్వాసాల ప్రకారం ఏ మాసంలో నీటిని అందించడం చాలా మంచిదిగా భావిస్తారు. జలదానం సమస్త దానాల కంటే గొప్పదని నమ్ముతారు. ఈ సమయంలో ఫ్యాన్ కూడా దానం చేయడం శ్రేయస్కరంగా భావిస్తారు. నెమలి ఈకలు విష్ణువుకి సమర్పించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని పాపాలను తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

ఈ మాసంలో ఎవరైనా బ్రాహ్మణులకు లేదా ఆకలితో అలమటిస్తున్న పశువులకు ఆహారం పెట్టే వారికి అంతులేని పుణ్యం లభిస్తుంది. శాస్త్రాల ప్రకారం విష్ణుప్రియం వైశాఖం అంటారు. అందుకే ఈ సమయంలో పేదవారికి పాదరక్షలు లేదా చెప్పులు దానం చేస్తే వైకుంఠానికి వెళతారని నమ్ముతారు.

వైశాఖ మాసంలో ప్రతిరోజు రావి చెట్టును పూజించే ఆచారం కూడా ఉంది. ఎందుకంటే రావి చెట్టులో విష్ణువు నివాసం ఉంటాడని నమ్ముతారు. ప్రతిరోజు రావి చెట్టుకు నీరు సమర్పించే సాయంత్రం ఆవ నూనె దీపం వెలిగించాలి. మహావిష్ణువుని ఆచారాల ప్రకారం పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయని చెబుతారు. విష్ణుమూర్తికి సమర్పించే నైవేద్యంలో తులసి ఆకులు తప్పనిసరిగా వేయాలి.

ఈ మంత్రాలని జపించండి

ఆర్థిక లాభం కోసం- ‘ఓంహ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః ’

గర్భం దాల్చేందుకు, బిడ్డల సంక్షేమం కోసం- ‘ఓం కలి కృష్ణాయ నమః’

అందరి క్షేమం కోసం- ‘ఓం నమో నారాయణాయ’

అనే మంత్రాలు జపించడం వల్ల మీ జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి.

వైశాఖ మాసంలో తీసుకోవాల్సిన పరిహారాలు

వైశాఖ మాసంలో కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం వల్ల ఒక వ్యక్తి ఆనందం శ్రేయస్సుతో ఆశీర్వదించబడతారని త్వరగా ధనవంతుల అవుతారని నమ్ముతారు. విష్ణుమూర్తిని పూజించిన వారికి అన్ని కష్టాలు దుఖాలు తొలగిపోతాయని నమ్మకం.

నువ్వులు, సత్తు, మామిడికాయలు, వస్త్రాలు మొదలైన వాటిని దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. వైశాఖ మాసంలో మీరు చేసే దానాల వల్ల పూర్వ పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.

వైశాఖ మాసంలోనే అక్షయ తృతీయ వస్తుంది. చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి లేదా మరేదైనా వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది. ఇలా చేయడం దేవతలు సంతోషించి వారి ఆశీర్వాదాలు మీపై కురిపిస్తారు.

ఈ మాసంలో వేసవికాలం ఎండలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల గొడుగులు, నీటి పాత్రలు, చెప్పులు వంటివి దానం చేయడానికి ఇది మంచి సమయం. ముఖ్యంగా ఎండలో పనిచేసే వారికి, జంతువులు, పక్షులకు కొన్ని ఆహార పదార్థాలు నీరు మొదలైనవి ఏర్పాటు చేయాలి. ఇలా చేయడం వల్ల దేవతలు సంతోషిస్తారు. మీ జీవితం ఆనందమయం అవుతుంది.

ఏదైనా వ్యాధులతో బాధపడేవారు రోగాల నుంచి ఉపశమనం పొందేందుకు వైశాఖ మాసంలో కంచు పాత్రలో ఆహారాన్ని తీసుకోవాలి.

వైశాఖ మాసంలో ప్రతి సోమవారం నాడు శివుడికి రుద్రాభిషేకం విధిగా నిర్వహించాలి. అలాగే స్వామికి ప్రత్యేక వస్తువులు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి.