posted on Apr 23, 2024 3:13PM

రాజకీయాల్లో రాణించడానికి చదువు అవసరం లేదు. పంచాయతీ  బోర్డు మెంబెర్ మొదలు ప్రధాని పదవి వరకు, ఏ పదవికి విధ్యార్హతలు అక్కరలేదు. ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోటీ చేయవచ్చును. ప్రజలు గెలిపిస్తే చాలు,  ఎమ్మెల్ల్యే, ఎంపీ , మంత్రి,  ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి  ఏదైనా కావచ్చును. ఏ పదవికీ చదవు సంధ్యలు అవసరం లేదు, డిగ్రీలు అక్కరలేదు. అయినా,  రాజకీయ నాయకుల విధ్యార్హతలు, డిగ్రీలు తరచూ వివాదం అవుతూనే ఉంటాయి.  ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీలపై వివాదం నడిచిన సంగతి తెలిసిందే. మోదీ విద్యార్హతలు, డిగ్రీలకు సంబంధించిన సమాచారం కోసం సమాచార హక్కు చట్టం కింద తెలుసుకునేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్  చేసిన ప్రయత్నాలు ఫలిచలేదు.   అలాగే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ..మరి కొందరు ముఖ్య నేతలకు సంబందించిన  డిగ్రీ  విషయంలోనూ వివాదాలు, విచారణలు జరిగాయి. జరుగుతున్నాయి. ఇప్పడు ఆ జాబితాలో  ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని  సీతారం పేరు కూడా చేరింది.  ఆయన డిగ్రీ చదువు కోలేదనీ, చదువు కొన్నారనీ తెలుగుదేశం గతంలో ఆరోపించింది.  సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ కూడా చేసింది. అదలా ఉంచితే ఇప్పుడు స్వయంగా తమ్మినేని సీతారాం తాను డిగ్రీ చదువు కోలేదని అంగీకరించారు. అంగీకరించడమంటే మౌఖికంగా చెప్పడం కాదు.. ఆముదాలవలస వైసీపీ అభ్యర్థిగా పోటీకి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఆ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో ఆయన విద్యార్హతకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. తమ్మినేని ఎన్నికల అఫిడవిట్ లో డిగ్రీ డిస్ కంటిన్యూ అని ఉంది. మరి డిగ్రీ పూర్తి కాకుండా తమ్మినేని లా ఎలా చేశారు. 

  తాను డిగ్రీ పూర్తి చేశానని చెప్పి హైదరాబాద్ లో ఓ లా కాలేజీలో అడ్మిషన్ పొందారు. డిగ్రీ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. గత ఏడాది ఈ అంశంపై పెద్ద దుమారం కూడా రేగింది. అదలా ఉండగానే ఇప్పుడు ఆయన తన ఎన్నికల అఫిడవిట్ లో  డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని స్పీకర్ నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ పెట్టి లా కోర్సులో చేరారని గత కొంత కాలం కిందట తెలుగుదేశం బయట పెట్టింది.  దీనిపై కిమ్మనని తమ్మినేని ఇప్పుడు తాను డిగ్రీ పూర్తి చేయలేదంటూ ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇక ఇప్పుడు ఆయనకు లా కాలేజీలో అడ్మిషన్ ఎలా లభించింది. ఆయన నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ సమర్పించి ఉంటే చట్టపరంగా చర్యలకు రెడీ అవ్వాల్సిందే అని పరిశీలకులు అంటున్నారు.