TS Schools Holidays : తెలంగాణలో బడులకు వేసవి సెలవులు(TS Schools Holidays) ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రేపటి నుంచి(ఏప్రిల్ 24) వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించింది విద్యాశాఖ. వచ్చే విద్యాసంవత్సరానికి(2024-25) జూన్ 12వ తేదీన స్కూళ్లు పునఃప్రారంభం(Schools Reopen) కానున్నాయి. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఇవాళ ప్రోగ్రెస్ కార్డులు(Progress Reports) అందజేసి, విద్యార్థులతో సమావేశం నిర్వహించారు.

సెలవుల్లో క్లాసెస్ నిర్వహిస్తే కఠిన చర్యలు

రాష్ట్రంలో పాఠశాలలకు(TS Schools) మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు మొదలైన విషయం తెలిసిందే. నేటితో ఒంటిబడులు ముగిశాయి. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు నిన్నటితో సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌(SA2) పరీక్షలు ముగిశాయి. జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఇవాళ ఫలితాలను ప్రకటించారు. ఈ విద్యాసంవత్సరం చివరి రోజైన మంగళవారం…తల్లిదండ్రులతో సమావేశాలను నిర్వహించి ప్రోగ్రెస్ రికార్డులు అందజేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు స్కూళ్లకు బుధవారం నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులు(TS Summer Holidays) ఉంటాయి. వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఎలాంటి తరగతులు నిర్వహించవద్దని విద్యాశాఖ ఆదేశించింది. సెలవుల్లో తదుపరి తరగతులకు బోధన నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

విద్యార్థులకు సూచనలు

రాష్ట్రంలో ఎండల తీవ్రత(Summer Heat) అధికంగా ఉందని, సెలవుల్లో విద్యార్థులు ఎండల్లో తిరగకుండా తల్లిదండ్రులు వారిపై దృష్టిపెట్టాలని అధికారులు సూచించారు. అలాగే తల్లిదండ్రులకు చెప్పకుండా చెరువులు, బావులు, కాలువల్లో ఈతకు వెళ్లవద్దని విద్యార్థులను కోరారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు ఓ కన్నేయాలని సూచించారు. రాష్ట్రంలో ఇంటర్, పదో తరగతి పరీక్షలు పూర్తైన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫలితాలు(TS Inter Results 2024) బుధవారం విడుదల కానున్నాయి. ఈ నెల 30న పదో తరగతి ఫలితాలు(TS 10th Results 2024) విడుదల కానున్నాయి.

ఏపీలో ‘హాలిడే ఫన్’ కార్యక్రమం

ఏపీలో రేపట్నుంచి వేసవి సెలవులు(AP Schools Holidays) ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్‌ 11వ తేదీ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది విద్యాశాఖ. ఏపీలో ఇప్పటికే ఇంటర్, పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ‘హాలిడే ఫన్‌ 2024’ పేరుతో ఓ కొత్త కార్యక్రమాన్ని విద్యాశాఖ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు కోచింగ్‌ క్యాంపులు నిర్వహించనున్నారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచేందుకు ‘వి లవ్‌ రీడింగ్‌’ పేరుతో పోటీ నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ సూచనలు చేసింది.