OTT Telugu Releases this week: ఓటీటీలోకి ఈవారం కూడా కొన్ని చిత్రాలు అడుపెట్టనున్నాయి. అందులో రెండు తెలుగు సినిమాలు హైలైట్‍గా ఉన్నాయి. ఈ ఏప్రిల్ నాలుగో వారంలోనే టిల్లు స్క్వేర్, భీమా చిత్రాలు ఓటీటీల్లోకి రానున్నాయి. థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన టిల్లు స్క్వేర్ ఓటీటీలోనూ అలరించేందుకు రానుంది. యాక్షన్ ప్యాక్డ్ భీమా కూడా స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. ఈవారం ఓటీటీలోకి రానున్న ఈ రెండు సినిమాల స్ట్రీమింగ్ వివరాలు ఇవే.

భీమా

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా రూపొందిన భీమా చిత్రం మార్చి 8న థియేటర్లలో విడుదలైంది. ఫ్యాంటసీ యాక్షన్ చిత్రంగా వచ్చింది. హర్ష దర్శకత్వం వహించిన ఈ మూవీ మంచి హైప్‍తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, అంచనాలకు తగ్గట్టుగా వసూళ్లను రాబట్టలేకపోయింది. మిశ్రమ స్పందనను దక్కించుకొని.. బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే, ఈ భీమా మూవీ ఈవారం ఓటీటీలోకి రానుంది.

భీమా చిత్రం ఏప్రిల్ 25వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని హాట్‍స్టార్ ఇప్పటికే అధికారికంగా వెల్లడించింది. భీమా మూవీలో గోపీచంద్ డ్యుయల్ రోల్‍లో కనిపించారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్, శుభలేఖ సుధాకర్, నాజర్, నరేశ్ కీరోల్స్ చేయగా.. రవిబస్రూర్ సంగీతం అందించారు. ఈ భీమా మూవీని ఏప్రిల్ 25 నుంచి హాట్‍స్టార్ ఓటీటీలో చూసేయవచ్చు.

టిల్లు స్క్వేర్

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన టిల్లు స్క్వేర్ మూవీ థియేటర్లలో బ్లాక్‍బస్టర్ అయింది. రూ.125 కోట్లకుపైగా వసూళ్లను సాధించి ఈ కామెడీ థ్రిల్లర్ చిత్రం సూపర్ హిట్‍గా నిలిచింది. అంచనాలకు మించి సక్సెస్ అయింది. అయితే, థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది.

టిల్లు స్క్వేర్ చిత్రం ఏప్రిల్ 26వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. థియేటర్లలో దుమ్మురేపిన ఈ చిత్రం ఓటీటీలోనూ భారీగా వ్యూస్ దక్కించుకుంటుందనే అంచనాలు ఉన్నాయి.

టిల్లు స్క్వేర్ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. డీజే టిల్లుకు సీక్వెల్‍గా రెండేళ్ల తర్వాత వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. టిల్లు స్క్వేర్‌లో సిద్ధు జొన్నలగడ్డ తన యాక్టింగ్, డైలాగ్‍లో మరోసారి అదరగొట్టారు. ఈ మూవీలో మురళీధర్ గౌడ్, ప్రిన్స్ సెసిల్, మురళీ శర్మ, ప్రణీత్ రెడ్డి కీరోల్స్ చేశారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లు నిర్మించగా.. రామ్ మిర్యాల, అచ్చు రాజమణి, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేశారు.

టిల్లు స్క్వేర్ మూవీని మెగాస్టార్ చిరంజీవి, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సహా మరికొందరు సెలెబ్రెటీలు కూడా ప్రశంసించారు. ఈ మూవీ సక్సెస్ మీట్‍కు కూడా ఎన్టీఆర్ హాజరయ్యారు. ఇక, ఈ టిల్లు స్క్వేర్ మూవీని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఏప్రిల్ 26 నుంచి చూడొచ్చు.