Tirumala Ugadi Srirama navami Utsav : తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 9న క్రోధినామ సంవత్సర ఉగాది (Krodhi Nama Ugadi 2024)ఆస్థానం శాస్త్రోక్తంగా జ‌రుగ‌నుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించి అనంతరం ఆలయం శుద్ధి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి, విష్వక్సేనులకు విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుంచి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి స్వామి వారు ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవ‌ మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 9న శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన(Tiurmala Arjita Seva) అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను టీటీడీ(TTD) రద్దు చేసింది.