AP PGECET 2024 : ఏపీ పీజీఈసెట్‌ 2024 నోటిఫికేషన్‌ను(AP PGCET Notification) రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఏపీ పీజీఈసెట్ ను తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. ఏపీలోని యూనివర్సిటీలు, అఫిలియేటెడ్‌ ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్, ఫార్మసీ కాలేజీల్లో ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఫార్మ్‌ డీ(PB) కోర్సుల్లో ప్రవేశాలకు పీజీఈసెట్ నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్‌ 20 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మే 29 నుంచి 31వ తేదీ వరకు ఏపీ పీజీఈసెట్ పరీక్ష(PGECT Exam Dates) నిర్వహిస్తారు. అయితే రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 28వ తేదీ వరకు, రూ.2000 ఆలస్య రుసుము(Late Fee)తో మే 5 వరకు, రూ.5000 ఆలస్య రుసుముతో మే 12 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. అభ్యర్థులు దరఖాస్తుల మార్పుచేర్పులు చేసుకునేందుకు మే 8 నుంచి 14 వరకు కరెక్షన్ విండో ఓపెన్ చేస్తారు. సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్‌, బీఫార్మసీ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు, లేదా చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. గేట్‌, జీప్యాట్‌ అర్హత సాధించిన అభ్యర్థుల అడ్మిషన్ల కోసం మరో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు.