- బంగారం వ్యాపారులపై చర్యలకు డిమాండ్
- 18 క్యారెట్ల బంగారాన్ని 24 క్యారెట్లుగా అమ్ముతూ దోపిడీ
- అనుమతులు లేని ల్యాబ్లపై సోదాలు చేయాలి
- మాజీ సర్పంచ్ మిత్రు నాయక్
జనవాహిని ప్రతినిధి తాండూరు: ఎలాంటి లైసెన్సులు, అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా గోల్డ్ ప్యూరిటీ టెస్టులు నిర్వహిస్తూ, వినియోగదారులను నిలువునా ముంచుతున్న పలు బంగారం దుకాణాలపై అధికారులు తక్షణమే సోదాలు జరిపి చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్ మిత్రు నాయక్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లో జరుగుతున్న గోల్డ్ మోసాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలైన 24 క్యారెట్ల బంగారాన్ని విక్రయించాల్సిన వ్యాపారులు, కేవలం 18 క్యారెట్ల బంగారాన్ని 24 క్యారెట్లుగా నమ్మబలికి అమాయక ప్రజలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. తక్కువ నాణ్యత కలిగిన బంగారాన్ని మేలిమి బంగారంగా చూపిస్తూ ప్రజల నుంచి అక్రమంగా భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.పేద, మధ్యతరగతి ప్రజల రక్తాన్ని తాగుతున్న ఇలాంటి అక్రమ వ్యాపారులను చట్టం ముందు నిలబెట్టాలన్నారు. బంగారం కొని మోసపోయిన బాధితులంతా ఏకం కావాలని, మోసపోయిన బాధితులు తనను సంప్రదించాలని సూచించారు. బాధితులందరికి అందరికీ న్యాయం జరిగేంత వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా మిత్రు నాయక్ పేర్కొన్నారు. అధికార యంత్రాంగం వెంటనే స్పందించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న బంగారం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.