ఏపీలో మరో భారీ బంగారుగని.. జొన్నగిరిని మించి… సర్కార్ ఫోకస్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారు గనుల నిక్షేపాలు బయటపడుతున్న క్రమంలో ఏపీ ప్రభుత్వం ఈ ఖనిజ సంపదతో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తోంది రాయలసీమ ప్రాంతాన్ని దేశంలోనే అతిపెద్ద గోల్డ్ హబ్ గా మార్చే లక్ష్యంతో ప్రణాళికలను రూపొందిస్తోంది.
జొన్నగిరిలో మేడ్ ఇన్ ఆంధ్రా బంగారం
ఇప్పటికే కర్నూలు జిల్లా జొన్నగిరి లో దేశంలోనే మొట్టమొదటి భారీ ప్రైవేట్ బంగారు గని ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. ఇక్కడ ఉత్పత్తి బంగారం బిస్కెట్ల రూపంలో మార్కెట్లోకి అందుబాటులో ఉంది. మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటూ బయట మార్కెట్లో ఆంధ్ర బంగారం అందుబాటులోకి వచ్చింది.

రామగిరి బంగారు గనుల పరిధిలోని ప్రాంతాలను పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర
తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి గోల్డ్ మైన్స్, చిత్తూరు జిల్లా పరిధిలోని చిగురు గుంట తో పాటు మరికొన్ని ప్రాంతాలలో బంగారు నిక్షేపాలు వెలికితీత, మరియు వేలం ప్రక్రియ పైన ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. ఈ క్రమంలో నేడు రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి రామగిరి బంగారు గనుల పరిధిలోని ప్రాంతాలను పరిశీలించారు.
రామగిరిలో టన్ను మట్టికి ఏకంగా నాలుగు గ్రాముల వరకు బంగారం
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జొన్నగిరి మైనింగ్లో ఒక టన్ను మట్టిని ప్రాసెస్ చేస్తే ఒక గ్రాము బంగారం వస్తుందని అయితే శాస్త్రవేత్తల అంచనా ప్రకారం రామగిరి గోల్డ్ మైన్స్ లో నాణ్యత మరింత ఎక్కువగా ఉండి ఒక టన్ను మట్టికి ఏకంగా నాలుగు గ్రాముల వరకు బంగారం లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. రామగిరి లో దాదాపు 416 ఎకరాల పరిధిలో ఈ గనులు విస్తరించి ఉన్నాయని భావిస్తున్నారు.
త్వరలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో టెండర్లు
ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాథమిక సర్వేలు పూర్తికాగా, త్వరలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో టెండర్లు కూడా పిలుస్తామని, అత్యుత్తమ సాంకేతికతతో మైనింగ్ పనులు ప్రారంభిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఇక ఇవి మాత్రమే కాదు చిత్తూరు జిల్లా చిగురు కుంట తో పాటు ఏపీలోని మరో మూడు ప్రాంతాలలో కూడా బంగారు గనులను గుర్తించినట్టు ఆయన అన్నారు
