ఏపీలో ఫ్రీగా ఇంటర్ తో పాటు నీట్ /జేఈఈ కోచింగ్-అడ్మిషన్లు, పూర్తి వివరాలివే..!
ఏపీలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (APSWREIS) ప్రముఖ కోచింగ్ సంస్థల సహకారంతో నడుపుతున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో జాతీయ స్దాయి పోటీ పరీక్షలైన జేఈఈ, నీట్ కు ఉచిత శిక్షణ ఇవ్వబోతోంది. ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర (MPC/BiPC) కోర్సులలో ప్రవేశం కోసం అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది రాష్ట్రంలో మూడు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ (Co-education) కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ స్వేరిస్ కార్యదర్శి వి.ప్రసన్న వెంకటేష్ తెలిపారు. విశాఖ జిల్లా మేఘాద్రిగడ్డ, అమరావతిలోని తాడికొండ, నెల్లూరు జిల్లా కోటలో ఉన్న మూడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గురుకులాల్లో ఈ ఎక్సలెన్సీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మార్చి 2026లో జరిగిన పదో తరగతి ఉత్తీర్ణులై, 85% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్ధులు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. మార్చి 2026లో ఇంటర్ మొదటి సంవత్సరం (MPC/BiPC)లో 75% మార్కులు సాధించిన విద్యార్థులు రెండో సంవత్సరం కోసం దరఖాస్తు చేసుకోవచన్నారు.

ఈ ‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ (Co-education) కేంద్రాల ద్వారా నాణ్యమైన ఇంటర్మీడియట్ విద్యతో పాటు సమగ్రమైన IIT-జేఈఈ, నీట్ కోచింగ్, వసతి, భోజనం, స్టడీ మెటీరియల్, ఇతర విద్యాపరమైన సహాయంతో కూడిన ఉచిత గురుకుల విద్యను అందిస్తామని తెలిపారు. షెడ్యూల్డ్ కులాల (SC) విద్యార్థులకు 75% సీట్లు, ఇతర వర్గాల (OC, ST, BC) విద్యార్థులకు 25% సీట్లు కేటాయించే రిజర్వేషన్ విధానం ప్రకారం ప్రవేశాలు కల్పిస్తామన్నారు. APBRAGCET వెబ్సైట్ https://apbrageet.apcfss.in లో 17 జూలై 2026 నుండి ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ 30 జూలై 2026 అని తెలిపారు. ఇప్పటికే ఇతర జూనియర్ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రసన్న వెంకటేష్ తెలిపారు.


