- తాండూరు సాయిపూర్లో వైభవంగా ‘ఏరువాక’ సంబరాలు
- ఘనంగా ఎడ్లబండ్ల ఊరేగింపు
- పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన 'ఏరువాక పౌర్ణమి' వేడుకలను తాండూరు పట్టణంలోని సాయిపూర్లో స్థానిక రైతులు, ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వ్యవసాయ సంవత్సరం ప్రారంభానికి సూచికగా జరుపుకునే ఈ పండుగను పురస్కరించుకుని రైతులు ఉదయాన్నే తమ పాడి పశువులను, ఎడ్లను శుభ్రం చేసి, రంగురంగుల రంగులతో, గజ్జెలతో ముస్తాబు చేశారు. నాగళ్లకు, వ్యవసాయ పనిముట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి సాగు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సంప్రదాయ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని సందడి చేశారు. సాయిపూర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ బంటు వేణు, 10వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బంటు మల్లప్ప, సోంపల్లి శ్రీనివాస్ లు హాజరయ్యారు.ఈ సందర్భంగా నాయకులు స్వయంగా అలంకరించిన ఎడ్లబండిని తోలుతూ కాలనీ వీధుల్లో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. కాలనీ నలుమూలల నుండి రైతులు తమ ఎడ్లబండ్లతో ఈ ఊరేగింపులో కలవడంతో సాయిపూర్ వీధులన్నీ పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.ఈ సందర్భంగా కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. రైతే రాజు అనే నినాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఏరువాక పౌర్ణమి వేళ రైతులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు.ఈ ఏడాది సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, రైతుల ఇళ్లు సిరిసంపదలతో తులతూగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారు పేర్కొన్నారు.












Leave a Reply