- సీతారాంపేట్ 19వ వార్డులో చుక్కల పంపిణీ
- కార్యక్రమాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ వెంకటేష్ జుంటుపల్లి
జనవాహిని ప్రతినిధి తాండూరు : దేశాన్ని పోలియో రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం ఆదివారం పట్టణంలో నిర్వహించారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని సీతారాంపేట్ 19వ వార్డు కౌన్సిలర్ వెంకటేష్ జుంటుపల్లి ఆధ్వర్యంలో బృందావన్ కాలనీ మరియు స్థానిక అంగన్వాడీ కేంద్రంలో పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసి చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ వెంకటేష్ జుంటుపల్లి మాట్లాడుతూ.. ఐదేళ్ల లోపు వయసున్న ప్రతి ఒక్క చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం తల్లిదండ్రుల సామాజిక బాధ్యత అని అన్నారు. భవిష్యత్తు తరాలు వైకల్య రహితంగా, ఆరోగ్యంగా జీవించాలనే సత్సంకల్పంతో ప్రభుత్వం ఉచితంగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. వార్డు పరిధిలోని ఏ ఒక్క చిన్నారులకు పోలియో చుక్కలు వేసుకోకుండా మిగిలిపోవద్దనే లక్ష్యంతో వైద్యారోగ్య శాఖ, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కాలనీ ప్రజలు, తల్లులు ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు సుజాత, రైసా బేగంలు పాల్గొని చిన్నారులకు టీకాలు వేశారు. వార్డు ప్రజలు, కాలనీ పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరై తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, వార్డు ప్రముఖులు పాల్గొన్నారు.












Leave a Reply