- అంగన్వాడీ కేంద్రాల్లో కౌన్సిలర్ దివిటి ఎల్లప్ప ఆకస్మిక తనిఖీ
- భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించిన కౌన్సిలర్
- చిన్నారులకు పుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు కౌన్సిలర్ దివిటి ఎల్లప్ప సోమవారం తమ వార్డు పరిధిలోని రెండు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. కేంద్రాల్లో చిన్నారులకు అందుతున్న సౌకర్యాలు, విద్యాబోధన, పౌష్టికాహార పంపిణీ తీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ ఎల్లప్ప మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తోందని, దీని నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని సిబ్బందిని ఆదేశించారు. కేంద్రంలో విద్యార్థులకు వడ్డించే భోజనాన్ని ఆయన స్వయంగా రుచి చూసి, ఆహార నాణ్యతను పరిశీలించారు. చిన్నారులకు మెనూ ప్రకారం రుచికరమైన, శుభ్రమైన పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు కౌన్సిలర్ దివిటి ఎల్లప్ప చేతుల మీదుగా పుస్తకాలు, యూనిఫామ్లను పంపిణీ చేశారు. చిన్నారులను అప్యాయంగా పలకరిస్తూ.. వారు క్రమం తప్పకుండా కేంద్రానికి వచ్చేలా చూడాలని తల్లిదండ్రులకు, సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, వార్డు ప్రముఖులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.




