- ప్రభుత్వ పాఠశాలల మూసివేత కుట్రను తిప్పికొట్టాలి
- కార్పొరేట్ విద్యా మాఫియాకు ప్రభుత్వం రెడ్ కార్పెట్
- బంద్ ను విజయవంతం చేయాలని తాండూరు నగర అధ్యక్షులు నర్సిములు పిలుపు
జనవాహిని ప్రతినిధి తాండూరు : రాష్ట్రంలోని పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తూ, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీకి కొమ్ముకాస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా జూన్ 23న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన పాఠశాలల బంద్ను విజయవంతం చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ తాండూరు నగర అధ్యక్షులు నర్సిములు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కార్పొరేట్ విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 23,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి, పేద విద్యార్థులను చదువుకు దూరం చేయాలని ప్రభుత్వం కుట్ర పూరితంగా అడుగులు వేస్తోందని ఆరోపించారు.ప్రైవేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా సాగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టడంలో విఫలమైన ప్రభుత్వం.. వారికి పరోక్షంగా సహకరిస్తూ రెడ్ కార్పెట్ పరుస్తోందని ధ్వజమెత్తారు. తక్షణమే ఫీజుల దోపిడీని నియంత్రించాలని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యావ్యవస్థ పరిరక్షణకై విద్యాసంస్థలు, మేధావులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తరలివచ్చి ఈ బంద్ను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఏబీవీపీ నాయకులు నవీన్ గౌడ్, అజయ్, మారుతి, మధు సుధన్ రెడ్డి, కార్తీక్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.




