- గాజీపూర్ సర్పంచ్ భర్త లాల్ రెడ్డిపై పెద్దేముల్ పీఎస్లో ఫిర్యాదు
- మహిళలని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషణలు
- ఊర్లో ఎలా బ్రతుకుతారో చూస్తా’ అంటూ ప్రాణహాని బెదిరింపులు
- రక్షణ కల్పించాలంటూ బాధితురాలు సత్యమ్మ ఆవేదన
జనవాహిని ప్రతినిధి తాండూరు : ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని కోరినందుకు ఓ పేద మహిళపై గ్రామ సర్పంచ్ భర్త అధికార అహంకారంతో రెచ్చిపోయిన ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో సంచలనం రేకెత్తించింది. బాధితురాలిని మరియు ఆమె కోడలిని మహిళలని కూడా చూడకుండా అత్యంత నీచంగా దూషించడమే కాకుండా, ఊర్లో ఉండనివ్వనంటూ ప్రాణహాని బెదిరింపులకు పాల్పడిన సర్పంచ్ భర్తపై శనివారం పెద్దేముల్ పోలీస్ స్టేషన్లో రాతపూర్వక ఫిర్యాదు నమోదైంది.బాధితురాలు దేవనూరు సత్యమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామానికి చెందిన ఆమె వ్యవసాయ కూలీగా జీవిస్తోంది. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ నడుస్తుండటంతో, తనకు ఇల్లు ఇప్పించాలని కోరుతూ సత్యమ్మ స్థానిక గ్రామ సర్పంచ్ భర్త లాల్ రెడ్డిని ఆశ్రయించింది. అయితే, పేదరికాన్ని, మహిళ అనే విచక్షణను కూడా మరిచిన లాల్ రెడ్డి.. మీరు మాకు ఓట్లు వేశారా..?అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. సత్యమ్మతో పాటు ఆమె కోడలు నాగమ్మను సమాజం తలదించుకునేలా తీవ్ర అసభ్య పదజాలంతో దూషించాడు.దూషణలతోనే ఆగకుండా బాధితుల వీధిలోకి వచ్చిన లాల్ రెడ్డి.. మీ సంగతి చూస్తా.. ఈ ఊర్లో మీరు ఎలా బ్రతుకుతారో చూస్తా.. మీ కొడుకుల అంతు చూస్తా” అంటూ పదేపదే బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశాడని పిర్యాదు లో పేర్కొన్నారు. ఇప్పటికే దాదాపు 15 సార్లకు పైగా తమను ఇదే రీతిలో అవమానిస్తూ, మానసిక వేదనకు గురిచేస్తున్నాడని బాధితురాలు కన్నీరుమున్నీరైంది. నిత్యం వస్తున్న బెదిరింపులతో తమ కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసింది.సర్పంచ్ భర్త వేధింపులు మితిమీరడంతో తట్టుకోలేకపోయిన బాధితురాలు దేవనూరు సత్యమ్మ శనివారం పెద్దేముల్ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ ను కలిసి ఫిర్యాదు సమర్పించింది. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, ప్రాణభయం కలిగిస్తున్న గాజీపూర్ సర్పంచ్ భర్త లాల్ రెడ్డిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. తమ కుటుంబానికి తగిన రక్షణ కల్పించి, న్యాయం చేయాలని ఆమె పోలీసులను వినమ్రంగా వేడుకుంది.




