- తాండూర్లో నీటి ఎద్దడిపై కలెక్టర్కు ఫిర్యాదు
- సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలి: బిఆర్ఎస్ నేతలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూర్ పట్టణంలో నెలకొన్న తీవ్రమైన నీటి ఎద్దడిని వెంటనే పరిష్కరించాలని కోరుతూ, మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్కు బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. పట్టణ ప్రజలు తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. తాండూర్ మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో నీటి కొరత తీవ్రంగా ఉందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ప్రతి వార్డుకు మూడు చొప్పున కొత్త బోర్లు మంజూరు చేయాలని కలెక్టర్ను కోరారు. తద్వారా నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.బిఆర్ఎస్ బృందం విజ్ఞప్తిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. పట్టణంలోని నీటి ఎద్దడి సమస్యపై వెంటనే దృష్టి సారించి, తగిన చర్యలు తీసుకుంటామని, త్వరితగతిన సమస్యను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తాండూర్ మున్సిపల్ బిఆర్ఎస్ కౌన్సిలర్లు ఇర్షాద్, అనిల్, యోగి, నాయకులు సంతోష్ గౌడ్, ఏజాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని, ఇందుకోసం నిరంతరం కృషి చేస్తామని నేతలు పేర్కొన్నారు.




