- ప్రతి ఇంటా మొక్కలు నాటి, సంరక్షించాలి
- తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ళ నీరజ బాలరెడ్డి పిలుపు
- పట్టణంలో ముమ్మరంగా సాగుతున్న వనమహోత్సవం
- వార్డుల్లో విస్తృతంగా మొక్కల పంపిణీ
జనవాహిని ప్రతినిధి తాండూరు : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా తాండూరు పట్టణ ప్రజలంతా భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ళ నీరజ బాలరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని ప్రతి వార్డులో, ప్రతి ఇంటా మొక్కలు నాటాలని, కేవలం నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఆమె కోరారు.వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 24, 1, 4, 5 వార్డులలో స్థానిక కౌన్సిలర్లు, మెప్మా సిబ్బంది ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి స్థానిక ప్రజలకు మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయని, భవిష్యత్తు తరాల మనుగడ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను పెంచాలని సూచించారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డి, సంబంధిత వార్డుల కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, మున్సిపల్ అధికారులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.






