- కాగ్నా వాగు నుంచి యథేచ్ఛగా అక్రమ రవాణా..
- ఎస్సై వాహనాన్ని ఢీకొట్టిన చర్యలు శూన్యం…!
- అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు..
- అండగా ఉన్నది రాజకీయ నాయకులేనా?
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు ప్రాంతంలో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అక్రమ రవాణాదారులు తమకు ఎదురులేదన్నట్లుగా రెచ్చిపోతున్నారు. నియమ నిబంధనలను తుంగలో తొక్కి, అధికారుల కళ్లు గప్పి.. లేదా వారి అండదండలతో కాగ్నా వాగు నుంచి ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు.శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నప్పటికీ, ఇసుక అక్రమ రవాణాదారులు మాత్రం విశ్రమించలేదు. ఎటువంటి అనుమతులు లేకుండా, పట్టపగలే దర్జాగా కాగ్నా వాగు నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతూ, తమ జేబులు నింపుకోవడమే ధ్యేయంగా మాఫియా చెలరేగిపోతోంది.తాజాగా బషీరాబాద్ మండలంలో జరిగిన సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అక్రమ ఇసుకను తరలిస్తున్న ఒక ట్రాక్టర్, ఏకంగా ఎస్సై వాహనాన్ని ఢీకొట్టిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసుల వాహనంపైకే దాడి జరిగినా, ఇప్పటివరకు సదరు వ్యక్తులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బందికి అక్రమ ఇసుక వైపు చూడవద్దని ఏవైనా అంతర్గత ఆదేశాలు ఉన్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇంత బహిరంగంగా దందా సాగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీని వెనుక బలమైన రాజకీయ నాయకుల హస్తం ఉండబట్టే అధికారులు మౌనం వహిస్తున్నారా? లేక అధికారులే వారికి అండగా నిలుస్తున్నారా? అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక ట్రాక్టర్లు అతివేగంగా, జనావాసాల మధ్య నుంచి వెళ్తుండటంతో స్థానికులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, కాగ్నా వాగును కాపాడుతూ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.





