- అంతర్జాతీయ పోటీల్లో కాంస్య పతకం సాధించిన ఎర్రా హర్షవర్ధన్
- రూ. 1.50 లక్షల ఆర్థిక సాయం అందించిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు : గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో అద్భుతమైన ప్రతిభ దాగి ఉంటుందని, దానికి అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన గాజీపూర్ నివాసి ఎర్రా హర్షవర్ధన్ విజయమే నిదర్శనమని ఆర్బిఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దేశం తరఫున ఆడి పతకం సాధించిన హర్షవర్ధన్ను ఆయన ఘనంగా సత్కరించారు.అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న హర్షవర్ధన్కు, గతంలో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి రూ. 1,50,000/- ఆర్ధిక సహాయం అందించి అండగా నిలిచారు. ఈ సందర్భంగా క్రీడాకారుడు హర్షవర్ధన్ మాట్లాడుతూ.. శ్రీనివాస్ రెడ్డి సకాలంలో చేసిన ఆర్థిక సహాయం వల్లే నేను అంతర్జాతీయ వేదికపై దేశానికి పతకం తీసుకురాగలిగాను అంటూ కృతజ్ఞతలు తెలిపారు. యువత క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించాలని ఆర్బిఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతిభ ఉన్న గ్రామీణ యువతను ప్రోత్సహించడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు, క్రీడాభిమానులు పాల్గొని అంతర్జాతీయ విజేతకు అభినందనలు తెలిపారు.






