క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ నేతల పర్యటనలు

రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటి సాగునీరు పంటల పొలాలు ఎండిపోవడంతో బిఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి లో ఎండిన పంటలను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పరిశీలించారు. సాగునీరు లేక పంటలు ఎండి పుట్టెడు దుఃఖంతో ఉన్న రైతులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు. కాలం తెచ్చిన కరువు కాదు…కాంగ్రెస్ తెచ్చిన కరువని ఆరోపించారు. పంటలు ఎండడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. రైతులను చూస్తే బాధేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ వద్ద కుంగిపోయిన మూడు పిల్లర్లను భూతద్దంలో చూపెడుతు రైతులకు సాగునీరు ఇవ్వడం లేదన్నారు. కుంగిపోయిన పిల్లర్ల వద్ద కాఫర్ డామ్ కట్టి నీటిని ఎత్తిపోస్తే రైతులకు సాగునీరు అంది పంటలు ఎండేవికాదని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులపై కాంగ్రెస్ నేతలు, సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టకుండా డిల్లీకి ఎక్కే విమానం, దిగే విమానం అన్నట్లు నాలుగు నెలలో 15 సార్లు జాత్రలు, యాత్రలు చేస్తున్నారే తప్పా, చేసిందేమీ లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై, కేసిఆర్ పై కడుపుమంటతో మేడిగడ్డ ను రిపేర్ చేయకుండా రైతుల పంటలను ఎండబెడుతుందని ద్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రాష్ట్ర వ్యాప్తంగా 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఆవేదనతో ఆందోళన చెంది ఆత్మహత్య లాంటి తీవ్రమైన చర్యలకు పాల్పడి కుటుంబాలను ఇబ్బంది పెట్టవద్దని.. మీకోసం కెసిఆర్ త్వరలో వస్తారని తెలిపారు. రైతులు ధైర్యంగా ఉండండి, మేం ఉన్నాం అంటూ దైర్యం చెప్పారు.