దిల్లీలో బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం

మరోవైపు ఇవాళ హస్తినలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ,ఈటల రాజేందర్ సహా ఇతర కీలక నేతలు హాజరు కానున్నారు. మరికొన్ని నెలల్లో జరుగనున్న లోక్ సభ ఎన్నికలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో నేతలు చర్చించనున్నారు. టికెట్ల కోసం పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర నేతలకు అధిష్టానం ఎలాంటి దిశా నిర్దేశం చేయబోతున్నదనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ భేటీ తర్వాత రాష్ట్రంలో సగం లోక్ సభ సీట్లకు పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. పార్టీ బలంగా ఉన్న చోట, ఇబ్బందులు లేని నియోజికవర్గాల్లో వీలైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేయడం ఉత్తమమని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారట. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన నాలుగు ఎంపీ సీట్లలో మూడింట్లో (ఆదిలాబాద్ మినహా) సిట్టింగ్ ఎంపీలనే బరిలోకి దింపాలని పార్టీ యోచిస్తోంది. ప్రస్తుతం హై కమండ్ వద్ద ఒక్కో నియోజకవర్గం నుంచి ఆశావహులకు సంబంధించి ముగ్గురు పేర్లతో కూడిన ఒక జాబితా సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. అన్ని కుదిరితే ఇవాళ లేదంటే మార్చి రెండో వారంలో అభ్యర్థులను అనౌన్స్ చేసేందుకు బీజేపీ హై కమాండ్ సిద్దంగా ఉన్నట్లు సమాచారం. తీవ్రమైన పోటీ ఉన్న మల్కాజిగిరి, మహబూబ్ నగర్ స్థానాల్లో ఎవరికి ఛాన్స్ దక్కుతుంది అనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతున్న అంశం. దీంతో ఈసారి టికెట్ల విషయంలో ఎవరు తగ్గుతారు ఎవరు నెగ్గుతారు అనేది రాజకీయ వర్గాల్లో ఇంటరెస్టింగ్ గా మారింది.