హరితహారం అగ్నికి అహుతి

– అధికారుల పర్యవేక్షణేది..!

– నెరవేరలేని లక్ష్యంతో.. ప్రజాధనం వృధా..

– మిగిలిన మొక్కలకైనా రక్షణ కల్పించాలి..

దిశ, తాండూరు :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో రోడ్డుకి ఇరువైపులా పెద్దఎత్తున మొక్కలు నాటినప్పటికీ కొందరు రైతులు, బాటసారుల తప్పిదంతో మొక్కలు అగ్నికి ఆహుతవుతున్నాయి. దీంతో ప్రభుత్వలక్ష్యం నెరవేరకపోవడంతో పాటు ప్రజాధనం వృథా అవుతోంది. మొక్కల చుట్టూ ముళ్లకంపలు, గడ్డి తొలగించకపోవడంతో రైతులు పొలాల్లోని చెత్తాచెదారం, ముళ్ల కంపలు తగులబెట్టే క్రమంలో, పాదచారులు వేసే నిప్పులకు మంటలు చెలరేగి మొక్కలు దగ్ధమవుతున్నాయి. తాండూరు మండల పరిధిలోని జింగుర్తి నుంచి సంకిరెడ్డిపల్లి కి వెళ్లే మార్గంలో శనివారం గడ్డికి నిప్పంటుకోవడంతో వరుసగా అగ్ని రాజుకుంటూ హరితహారం మొక్కలకు అంటుకుని చాలా మొక్కలు కాలిపోయాయి. ఇలాంటి సంఘటనలు తరచూజరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని పర్యావరణ ప్రేమికులు వాపోతున్నారు.క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో హరితహారం నెరవేరలేని లక్ష్యంగా ఉందని స్థానికులు వాపోతున్నారు.ఇప్పటికైనాఅధికారులు స్పందించి మిగిలిన మొక్కలకైనా రక్షణ కల్పించాలని, వాటిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్థానికులు కోరుతున్నారు.