- బషీరాబాద్లో గుప్త నిధుల తవ్వకాల కలకలం
- కర్ణాటక బాబాలతో క్షుద్ర పూజలు?
- భయాందోళనలో స్థానిక గ్రామస్థులు
జనవాహిని ప్రతినిధి తాండూరు: బషీరాబాద్ మండల పరిధిలో గుప్త నిధుల తవ్వకాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కొందరు అక్రమార్కులు రాత్రివేళల్లో గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు నిర్వహిస్తూ తవ్వకాలకు పాల్పడుతున్న ఘటనలు స్థానికంగా భయాందోళన కలిగిస్తున్నాయి.మండలంలోని జీవన్గి గ్రామంలో మూడు రోజుల క్రితం ఒక ఇంట్లో రాత్రి వేళల్లో రహస్యంగా క్షుద్ర పూజలు నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయనే ప్రచారంతో పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.అంతేకాకుండా, వారం రోజుల క్రితం బషీరాబాద్ మండల కేంద్రంలోని ఒక పాడుబడిన ఇంట్లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బృందంగా ఏర్పడి తవ్వకాలు చేపట్టారు. విషయం గుర్తించిన స్థానికులు అక్కడికి చేరుకునేలోపే వారు పరారయ్యారు. జీవన్గి గ్రామంలో కొన్ని నెలల క్రితం ఓ పురాతన దేవాలయంలోని నంది విగ్రహాన్ని, చుట్టుపక్కల ఉన్న బండలను దుండగులు పెకిలించి వేసిన ఘటన కూడా చోటుచేసుకుంది. ఈ వరుస ఘటనల వెనుక ఒకే ముఠా హస్తం ఉండి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.గుప్త నిధుల ఆశ చూపి ప్రజలను నమ్మించడానికి కర్ణాటకతో పాటు ఇతర పొరుగు రాష్ట్రాల నుంచి కొంతమంది పూజారులు, బాబాలను పిలిపిస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పోలీసులు వెంటనే స్పందించి ఈ తవ్వకాల వెనుక ఉన్న ముఠాను పట్టుకోవాలని, గ్రామంలో శాంతిభద్రతలు కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
