రేపే జగన్నాథుడి రథయాత్ర.. మీ అదృష్టాన్ని మార్చే రంగుల దుస్తులు ఇవే!
కదిలింది కనకరథం.. నడిచింది నీల మేఘ శ్యాముని పదఘట్టం! శంఖ నాదాల సవ్వడి మధ్య.. జై జగన్నాథ్ నినాదాల హోరు నడుమ.. జగతిని ఏలే ఆ జగన్నాథుడు.. భక్తకోటిని బ్రోవగా రోడ్డెక్కే వేళాయె! అన్న బలభద్రుడితో, సోదరి సుభద్రతో కలిసి.. కరుణాసింధువు కదిలివచ్చే మహోత్సవమిది!
కలియుగ వైకుంఠంగా భావించే పూరీ క్షేత్రంతో పాటు దేశవ్యాప్తంగా రేపు జగన్నాథ రథయాత్ర సంబరాలు అంబరాన్ని తాకనున్నాయి. కోట్లాది మంది భక్తుల హృదయ లయల మధ్య, రథాల తాడును తాకడమే జన్మధన్యతగా భావించే ఈ వేళ.. వస్త్రధారణకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. రథయాత్రలో పాల్గొనేటప్పుడు ఎలాంటి దుస్తులు ధరించాలనే దానిపై కఠినమైన రూల్స్ లేకపోయినా.. కొన్ని ప్రత్యేక రంగుల వస్త్రాలు ధరిస్తే సానుకూల శక్తి, ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తాయని పెద్దలు చెబుతుంటారు. ఈ పవిత్ర వేళ ఏయే రంగుల దుస్తులు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూద్దాం..

ఆధ్యాత్మికతకు ప్రతీక.. కేషరి (కాషాయం)
భారతీయ సనాతన ధర్మంలో కాషాయ రంగుకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. త్యాగానికి, వైరాగ్యానికి, ఆధ్యాత్మిక పరిణతికి ఈ రంగు నిదర్శనం. రథయాత్ర వంటి పవిత్రమైన రోజుల్లో కాషాయ రంగు కుర్తాలు లేదా ఉత్తరీయాలు ధరించడం వల్ల మనసులో దైవచింతన పెరుగుతుంది. సాధువులు, పూజారులు ఎక్కువగా ఈ రంగులోనే కనిపిస్తారు.
జ్ఞానాన్ని ప్రసాదించే పసుపు వర్ణం
శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన రంగు పసుపు. ఇది సత్యానికి, పరిపూర్ణ జ్ఞానానికి సంకేతం. రథోత్సవంలో పాల్గొనే మహిళలు పసుపు రంగు చీరలు లేదా సల్వార్ సూట్లు, పురుషులు పసుపు రంగు కుర్తాలు ధరించడం వల్ల లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ రంగు దుస్తులు పండగ వాతావరణానికి మరింత శోభను తెస్తాయి.
ప్రశాంతతను పంచే శ్వేత వర్ణం
స్వచ్ఛతకు, ప్రశాంతతకు మారుపేరు తెలుపు రంగు. పూరీ జగన్నాథుడి ఆలయానికి వెళ్లే భక్తులు ఎక్కువగా తెలుపు రంగు కాటన్ దుస్తులకే ప్రాధాన్యత ఇస్తారు. వేసవి/వర్షాకాల వాతావరణంలో ఇవి సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. పురుషులు తెల్లటి ధోవతి, లాల్చీలు ధరించి రథం తాడు లాగడం ఇక్కడ తరచూ కనిపించే దృశ్యం.
మంగళకరమైన ఎరుపు రంగు
హిందూ సంప్రదాయంలో ఎరుపు రంగును శక్తికి, సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మహిళలు ఎరుపు రంగు లేదా ఎరుపు అంచు ఉన్న సాంప్రదాయ చీరలను ధరించి స్వామివారిని దర్శించుకుంటారు. ఇది కొత్త ఉత్సాహాన్ని, విజయాలను అందిస్తుందని నమ్ముతారు.
కృష్ణుని తత్వానికి నిదర్శనం.. నీలి రంగు
జగన్నాథుడిని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుని స్వరూపంగా కొలుస్తారు. కాబట్టి, కృష్ణుడి వర్ణమైన నీలి రంగు (బ్లూ) దుస్తులు ధరించడం కూడా ఈ యాత్రలో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇది అనంతమైన దైవిక శక్తికి, కరుణకు సంకేతం. రాయల్ బ్లూ లేదా ఇండిగో రంగు దుస్తుల్లో భక్తులు ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు.

