సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. శోభన్బాబు సతీమణి కన్నుమూత
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సినీ పరిశ్రమలో సోగ్గాడిగా ప్రసిద్ధి చెందిన దివంగత నటుడు శోభన్బాబు సతీమణి శాంతకుమారి(86) గురువారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలం వయోధిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న శాంతకుమారి.. నాలుగు రోజుల క్రితం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. గురువారం ఆస్పత్రిలో ఆమెను పరామర్శించేందుకు ఓ ఆప్తమిత్రురాలు వచ్చారు. ఆ స్నేహితురాలితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతున్న సమయంలో అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్టుకు గురై ఆమె తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు.
నేడే అంత్యక్రియలు
శాంతకుమారి భౌతికకాయాన్ని చెన్నైలోని వారి నివాసానికి తరలించారు. ఆమె భౌతికకాయానికి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆమె మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.

తెలుగు సినీ పరిశ్రమలో క్రమశిక్షణకు, ఆదర్శవంతమైన జీవితానికి మారుపేరుగా నిలిచిన శోభన్ బాబు-శాంతకుమారి దంపతులకు ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. శోభన్ బాబు సినిమా రంగంలో అగ్రహీరోగా ఎదిగినప్పటికీ.. ఆయన సతీమణి శాంతకుమారి ఎప్పుడూ ప్రచారానిక దూరంగా, నిరాడంబరంగా జీవితాన్ని గడుపుతూ ఆయనకు కొండంత అండగా నిలిచారని సన్నిహితులు చెబుతారు. 2008 సంవత్సరంలో శోభన్ బాబు గుండెపోటుతో ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.







