- తాండూరు సబ్ డివిజన్లో నిబంధనలకు పాతర
- ప్రభుత్వాలు మారినా మారని అధికారులు
- ‘ఆడిందే ఆట.. పాడిందే పాట’గా వ్యవహారం
- మిగతా వారికి ఛాన్స్ ఇవ్వరా అని పోలీస్ వర్గాల్లోనే చర్చ
తాండూరు జనవాహిని ప్రతినిధి : తాండూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఇంటెలిజెన్స్ విభాగం తీరుపై ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చ నడుస్తోంది. సొంత నియోజకవర్గంలో కొందరు అధికారులు ఏళ్ల తరబడి ఇక్కడే తిష్ట వేయడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. సాధారణంగా పోలీస్ శాఖ నిబంధనల ప్రకారం ఏ ఒక్క వింగ్లోనైనా ఒక అధికారి గరిష్టంగా మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పని చేయడానికి వీల్లేదు. కానీ తాండూరు సబ్ డివిజన్లో మాత్రం గత పదేళ్లుగా కొందరు అధికారులు ఇక్కడే పాతుకుపోవడం గమనార్హం.గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఏ విధంగా చక్రం తిప్పారో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా సదరు అధికారులు అదే స్థానాల్లో కొనసాగుతున్నారు. ప్రభుత్వాలు మారినా తమ స్థానాలకు ఢోకా లేదన్నట్లుగా వారి వ్యవహారం నడుస్తోందని, ఇక్కడ వారిదే ఆడిందే ఆట.. పాడిందే పాట గా మారిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఒకే చోట పదేళ్ల పాటు ఎలా కొనసాగిస్తున్నారనే దానిపై పోలీస్ శాఖలోనే అంతర్గతంగా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.నిబంధనల ప్రకారం 3 ఏళ్ల కాలపరిమితి ముగిసినా బదిలీలు ఎందుకు చేయడం లేదు? వేరే వారికి ఇక్కడ పని చేసే అవకాశం ఇవ్వరా? మిగతా వారు పోలీసులు కారా? అని తోటి సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.ఇంటెలిజెన్స్ లాంటి కీలక విభాగంలో ఒకే చోట ఇన్నేళ్లు కొనసాగడం వల్ల పారదర్శకత లోపించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తాండూరు సబ్ డివిజన్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఏళ్ల తరబడి తిష్టవేసిన అధికారులపై దృష్టి సారించాలని, నిబంధనల ప్రకారం బదిలీలు చేపట్టి ఇతరులకు అవకాశం కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.




