- 36వ వార్డు సమస్యల పరిష్కారానికి కృషి
- మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని 36వ వార్డు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన వార్డు కౌన్సిలర్ రూప రుద్రు పటేల్తో కలిసి వార్డులో పర్యటించి, స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.వార్డులో దోమల నివారణకు గాను కౌన్సిలర్ రూప రుద్రు పటేల్ స్వయంగా పర్యవేక్షించి దోమల మందు (ఫాగింగ్) పిచికారీ చేయించారు. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పారిశుధ్య పనులను వేగవంతం చేయాలని కౌన్సిలర్ ఈ సందర్భంగా అధికారులను కోరారు.పర్యటనలో భాగంగా వార్డులోని డ్రైనేజీ సమస్యలు, రోడ్ల మరమ్మతులు మరియు వీధి దీపాల ఏర్పాటు వంటి పలు ప్రధాన అంశాలను కౌన్సిలర్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. వార్డులో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని విన్నవించారు. కౌన్సిలర్ విజ్ఞప్తిపై కమిషనర్ మధుసూదన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. వార్డులోని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు మున్సిపాలిటీ కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.





