- విద్యార్థి సంఘాల బంద్కు బీసీ సంఘం మద్దతు
- ఈ నెల 10న తాండూర్లో విద్యాసంస్థల బంద్
- ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సహించం
- జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు రాజ్కుమార్
జనవాహిని ప్రతినిధి తాండూరు :విద్యార్థుల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం కోసం వామపక్ష విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్ ఈ నెల 10వ తేదీన పిలుపునిచ్చిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్కు బీసీ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్కుమార్ తెలిపారు. స్థానిక తాండూర్లో బుధవారం నిర్వహించిన బీసీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ….రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు.పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, సకాలంలో స్కాలర్షిప్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కొరతను తీర్చడంతో పాటు, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. కార్పొరేట్ విద్యకు ప్రాధాన్యతనిచ్చే విధానాలను పునఃసమీక్షించి, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేలా ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. ఈ నెల 10న జరిగే బంద్లో విద్యార్థులు, యువజనులు, ప్రజాసంఘాలు, బీసీ సంఘం నాయకులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకుర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, వడ్డెర సంఘం జిల్లా నాయకులు వడ్డే సత్యనారాయణ, మహిళా నాయకులు అనిత, నరసమ్మ, మంజుల, జగదీశ్వరి, మంబాపూర్ మంజుల, మీడియా ఇన్చార్జ్ బసవరాజ్, తాండూర్ అధ్యక్షుడు బసంత్, యువ నాయకులు జోసఫ్, రాము ముదిరాజ్, పరమేష్, టైలర్ రమేష్, గోపాల్, నరసింహ, మంతటి రాజు, సురేష్, యాసర్, వినయ్, కిరణ్, శ్రవణ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.






