- గులాబీ’ గూటికి పర్వతాపూర్ నేతలు
- రోహిత్ రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు
- కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లోకి మధుసూదన్ రెడ్డి అండ్ టీమ్
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాండూరు మండలం పర్వతాపూర్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో వీరంతా గులాబీ కండువా కప్పుకున్నారు.పర్వతాపూర్ గ్రామానికి చెందిన ముఖ్య నాయకుడు మధుసూదన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి పైలెట్ రోహిత్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. గ్రామంలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా సమిష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. “కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మునిగిపోయే నావ, ఆ పార్టీలో భవిష్యత్తు లేదని గ్రహించే నాయకులు బయటకు వస్తున్నారు” అని ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల నమ్మకం సడలిందని, రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను చూసి, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై నాయకులు చేరుతున్నారని రోహిత్ రెడ్డి తెలిపారు. ప్రతి కార్యకర్తను పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని భరోసా ఇచ్చారు.ఈ చేరికల కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గ మహిళా కన్వీనర్ శకుంతల, పార్టీ నాయకులు వీరారెడ్డి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.



