- ప్రచారంకు ‘గబ్బర్ సింగ్’ టీం!
- అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఇంటింటికీ జనసేన
- పాల్గొననున్న రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్
జనవాహిని ప్రతినిధి తాండూరు : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ తాండూరులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జనసేన పార్టీ తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ వినూత్నంగా ప్రజల్లోకి వెళ్తోంది. దీనిలో భాగంగా పార్టీ అభ్యర్థుల విజయానికి మద్దతుగా ‘గబ్బర్ సింగ్’ టీం మరికాసేపట్లో తాండూరు పట్టణానికి చేరుకోనుంది. పవన్ కళ్యాణ్ చిత్రాల్లోని గబ్బర్ సింగ్ గ్యాంగ్ను పోలి ఉండే ఈ టీం, తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకోనుంది.తాండూరు మున్సిపల్ పరిధిలోని జనసేన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఈ మెగా ప్రచారం సాగనుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జనసేన ఇంచార్జ్ శంకర్ గౌడ్ స్వయంగా పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. తాండూరు అభివృద్ధికి జనసేన ప్రాముఖ్యతను, పార్టీ సిద్ధాంతాలను ఆయన ప్రజలకు వివరించనున్నారు.షెడ్యూల్ ప్రకారం, ఈ ప్రచార పర్వం పట్టణంలోని 1వ వార్డు నుండి అధికారికంగా ప్రారంభం కానుంది. అక్కడి నుండి వరుసగా అన్ని వార్డుల్లో ఇంటింటికీ తిరిగి అభ్యర్థుల తరపున ఓట్లు అభ్యర్థించనున్నారు. గబ్బర్ సింగ్ టీం రాకతో అటు జనసైనికుల్లో, ఇటు సామాన్య ప్రజల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ ప్రచారంతో తాండూరులో జనసేన గ్రాఫ్ ఒక్కసారిగా పెరుగుతుందని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.






