వెంకీ తనయుడు అర్జున్ ఎంట్రీ ఫిక్స్.. త్రివిక్రమ్ సినిమాలో మెరుపులు!
విక్టరీ వెంకటేష్ తనయుడు అర్జున్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని నందమూరి బాలకృష్ణ వారసుడిలాగే దగ్గుబాటి అభిమానులు కూడా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ నిరీక్షణకు తెరపడబోతోంది. అవును.. దగ్గుబాటి మూడో తరం వారసుడి గ్రాండ్ ఎంట్రీకి టాలీవుడ్లో రంగం సిద్ధమైంది.
ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం (House No: 47)’ అనే చిత్రంలో నటిస్తున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై నిర్మితమవుతున్న ఈ క్లీన్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అక్టోబర్ 2న దసరా కానుకగా విడుదల కానుంది. ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా వెంకటేష్ వారసుడు అర్జున్ సినీ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు ఫిలింనగర్ సర్కిల్స్లో ఒక ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తోంది.

చివరి 5 నిమిషాల్లో అర్జున్ ఎంట్రీ
దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాలో అర్జున్ కోసం ఒక పవర్ఫుల్ గెస్ట్ అప్పియరెన్స్ రోల్ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా ముగింపులో వచ్చే ఈ పాత్ర కథను మలుపు తిప్పేలా, అత్యంత ప్రాధాన్యతతో కూడి ఉంటుందని సమాచారం. గతంలో అక్కినేని ఫ్యామిలీ నటించిన ‘మనం’ సినిమాలో అఖిల్ చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చి థియేటర్లలో ఎలాగైతే పూనకాలు తెప్పించాడో.. ఈ చిత్రంలోనూ అర్జున్ క్యారెక్టర్ అలాగే క్లైమాక్స్లో వచ్చి అందరినీ కాపాడుతుందని సమాచారం.
హీరోగా లాంచ్ చేయడానికి వెంకీ ప్లాన్!
అర్జున్ను పూర్తిస్థాయి హీరోగా పరిచయం చేయడానికి ముందు, ఇలాంటి ఒక క్రేజీ ప్రాజెక్ట్లో గెస్ట్ రోల్ ద్వారా పరిచయం చేస్తే ఆడియన్స్కు బాగా రీచ్ అవుతుందని వెంకటేష్ భావిస్తున్నారట. ఇందులో భాగంగానే తనయుడికి నటన, యాక్షన్ ఎపిసోడ్స్లో వెంకీ స్వయంగా మెలకువలు నేర్పిస్తూ ట్రైనింగ్ ఇస్తున్నట్లు టాక్. అయితే ఈ మెరుపు ఎంట్రీపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఈ వార్త నిజమై త్రివిక్రమ్ మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్తో అర్జున్ కనుక క్లైమాక్స్లో ఎంట్రీ ఇస్తే.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం అని ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. మరి అక్టోబర్ 2న థియేటర్లలో ఎలాంటి సర్ప్రైజ్ ఉండబోతుందో చూడాలి!









