- ఉపాధ్యాయుల ఉచిత భోజన పథకం ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి
- బకాయిలు ఇస్తే.. ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటారు!
- 430 కళాశాలల్లో చాక్పీస్లకూ కరవే.. విద్యావ్యవస్థను గాలికొదిలేశారు
- బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్కుమార్
జనవాహిని ప్రతినిధి, తాండూరు: రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, కాలేజీల బోధన, బోధనేతర సిబ్బందికి ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలనే ప్రభుత్వ ఆలోచన పూర్తిగా అవాస్తవ ప్రాధాన్యతలకు నిదర్శనమని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్కుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు. సోమవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ….విద్యాశాఖలో ఉన్న అసలు సమస్యలను పక్కనబెట్టి, ఇలాంటి ఉచిత పథకాలను తీసుకురావడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆరు డీఏలు , పీఆర్సీ అమలు కాక, పెండింగ్ బకాయిలు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాజ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. వారికి రావాల్సిన వేతన ప్రయోజనాలను సకాలంలో చెల్లిస్తే, వారు గౌరవంగా తమ ఇంటి నుంచే భోజనం తెచ్చుకుని విధులకు హాజరవుతారన్నారు. బకాయిలు ఇవ్వకుండా ఉచిత భోజనాల పేరుతో కొత్త గారడీలు చేయడం సమస్యకు పరిష్కారం కాదని హితవు పలికారు.రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ మరియు డిగ్రీ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉందనే విషయాన్ని రాజ్కుమార్ గుర్తుచేశారు.దాదాపు 430 ప్రభుత్వ కళాశాలల్లో చాక్పీస్లు, బోధనా సామగ్రి వంటి కనీస అవసరాలకే నిధులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో విద్యావ్యవస్థ ఇలా ఉంటే.. వాటిని పట్టించుకోకుండా ఉచిత భోజన పథకానికి నిధులు వెచ్చించడం ఎంతవరకు సమంజసంమని ప్రశ్నించారు. ఉచిత భోజన పథకం ప్రతిపాదనను పక్కనబెట్టి.. ఆ నిధులను ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు మరియు ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిల చెల్లింపులకే తక్షణమే వినియోగించాలని ఈ సందర్బంగా ఆయన డిమాండ్ చేశారు.






