- 52 సర్వే నెంబర్ భూమిపై అక్రమార్కుల కన్ను
- ఎంఆర్ఓకు వినతిపత్రం సమర్పించిన కౌన్సిలర్ అనిల్ కుమార్
జనవాహిని ప్రతినిధి తాండూరు : మాలెడ్డిపల్లి శివారులోని తాండూరు మున్సిపాలిటీకి చెందిన కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమార్కుల బారి నుండి కాపాడాలని 6వ వార్డు కౌన్సిలర్ బి. అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన తాండూరు మండల్ రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ కి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ.. మాలెడ్డిపల్లి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 52లో మున్సిపల్ కౌన్సిల్ యాజమాన్యానికి చెందిన 13 ఎకరాల 12 గుంటల భూమి ఉందన్నారు. మున్సిపల్ సంస్థ ఈ భూమిని 1964లోనే కొనుగోలు చేసిందని రికార్డులను ప్రభుత్వానికి సమర్పించారు. ఇందులో కొంత భాగం మున్సిపల్ భవనాలు, విద్యుత్ శాఖ, రాఘవేంద్ర కాలనీ అభివృద్ధికి కేటాయించగా.. మిగిలిన గణనీయమైన స్థలం ఇంకా మున్సిపాలిటీ పరిధిలోనే ఉందన్నారు.అయితే, ఇటీవల కొందరు వ్యక్తులు, సంస్థలు ఎటువంటి చట్టబద్ధమైన హక్కులు, అనుమతులు లేకుండానే ఈ ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారని ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ.. అక్రమార్కులు వెనక్కి తగ్గకుండా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ పనులు కొనసాగిస్తుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇది ప్రజా ఆస్తిపై జరిగిన తీవ్రమైన ఆక్రమణ యత్నం కావున, భవిష్యత్తులో మరిన్ని వివాదాలకు దారితీయక ముందే రెవెన్యూ అధికారులు స్పందించాలన్నారు. వివాదాస్పద సర్వే నెం. 52 భూమిని తక్షణమే అధికారికంగా సర్వే చేసి, అక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మున్సిపల్ భూమికి స్పష్టమైన హద్దులు నిర్ణయించి, హెచ్చరికా బోర్డులు ఏర్పాటు చేయాలని, రికార్డులను పారదర్శకంగా ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తుల రక్షణకై రెవెన్యూ యంత్రాంగం అత్యవసరంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు.




