- నేపాల్ షూటింగ్ బాల్ సిరీస్కు తాండూరు యువకుడు
- భారత జట్టు తరపున బరిలోకి యువకుడు మోయిజ్
- పేదరికాన్ని జయించి అంతర్జాతీయ స్థాయికి ఎంపిక
- అభినందిస్తున్న పట్టణ ప్రజలు, క్రీడాభిమానులు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు గడ్డపై మరో క్రీడా ఆణిముత్యం మెరిసింది. అసాధారణ ప్రతిభతో దూసుకుపోతున్న పట్టణానికి చెందిన యువకుడు మోయిజ్ అంతర్జాతీయ షూటింగ్ బాల్ వేదికపై భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ నెల 7, 9 తేదీలలో నేపాల్లోని ఖాట్మండు వేదికగా జరగనున్న ‘షూటింగ్ బాల్ సిరీస్-2026’ పోటీలకు మోయిజ్ ఎంపికయ్యాడు.తాండూరు పట్టణం ఇందిరానగర్కు చెందిన మోయిజ్ నేపథ్యం ఎంతో స్ఫూర్తిదాయకం. తండ్రి లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, మోయిజ్ తన చదువుతో పాటు క్రీడలపై మక్కువ పెంచుకున్నాడు. ఇంటర్ పూర్తి చేసిన అనంతరం ఆర్థిక ఇబ్బందుల వల్ల ల్యాబ్ టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తూనే, క్రీడల్లో తన శిక్షణను కొనసాగించాడు. స్థానిక కోచ్ రాము వద్ద ప్రత్యేక శిక్షణ పొందిన మోయిజ్, అంచలంచెలుగా ఎదుగుతూ నేడు దేశం తరపున ఆడే స్థాయికి చేరుకున్నాడు.సామాన్య కుటుంబం నుంచి వచ్చి, పట్టుదలతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన మోయిజ్ను పట్టణ ప్రజలు వేనోళ్ల కొనియాడుతున్నారు. “షబ్బాష్ మోయిజ్.. నేపాల్లోనూ సత్తా చాటి మన దేశానికి, తాండూరుకు గర్వకారణంగా నిలవాలి” అంటూ పలువురు ప్రముఖులు, క్రీడాకారులు ఆకాంక్షిస్తున్నారు.



