- ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో ఫ్లాగ్ మార్చ్
- ఎస్పీ స్నేహమేరా ఐపీఎస్ ఆదేశాలతో రంగంలోకి బలగాలు
- శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం: డీఎస్పీ నర్సింగ్ యాదయ్య
జనవాహిని ప్రతినిధి తాండూరు : పురపాలక ఎన్నికల నేపథ్యంలో తాండూరు పట్టణంలో బుధవారం పోలీసు బలగాలు భారీ సాయుధ కవాతు నిర్వహించాయి. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు, తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పట్టణంలోని సాయిపూర్ ప్రాంతం నుండి ప్రారంభమైన ఈ కవాతు ఇంద్రనగర్ మరియు పాత తాండూరు మీదుగా కొనసాగింది. జిల్లా ఏఆర్ ఫోర్స్ మరియు తాండూరు సబ్ డివిజన్ పోలీసు బలగాలు ఈ ఫ్లాగ్ మార్చ్లో పాల్గొన్నాయి. ఎన్నికల సమయంలో ఓటర్లు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కవాతు నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు. అసాంఘిక శక్తులు లేదా అల్లరి మూకలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పట్టణ ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీసు యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు.






