- తాండూర్కు ‘కాగ్న’ జలసిరి..!
- తీరనున్న త్రాగునీటి కష్టాలు!
- ఎమ్మెల్యే హామీ అమలుపై మున్సిపల్ యంత్రాంగం కసరత్తు
- కాగ్న పంప్ హౌస్ను సందర్శించిన చైర్పర్సన్, కమిషనర్ బృందం
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూర్ పట్టణ ప్రజల దశాబ్దాల కల అయిన ‘శాశ్వత త్రాగునీటి పరిష్కారం’ దిశగా అడుగులు పడుతున్నాయి. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా కాగ్న నది నుండి పట్టణానికి పూర్తిస్థాయిలో నీటిని అందించేందుకు మున్సిపల్ యంత్రాంగం నడుం బిగించింది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చే ప్రక్రియలో భాగంగా బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది.మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి మరియు కౌన్సిలర్ల బృందం కాగ్న నది వద్ద గల పంప్ హౌస్ను సందర్శించారు. అక్కడ ఉన్న సాంకేతిక యంత్రాల పనితీరు, నీటి నిల్వ సామర్థ్యం మరియు సరఫరాలో తలెత్తుతున్న ఆటంకాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ పర్యటనలో భాగంగా అధికారులతో నిర్వహించిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాత యంత్రాల స్థానంలో కొత్త టెక్నాలజీని ఉపయోగించి నీటి పంపింగ్ను వేగవంతం చేయడం.ప్రజలకు కేవలం నీరు మాత్రమే కాకుండా, పూర్తిస్థాయిలో శుద్ధి చేసిన సురక్షిత జలాలను అందించడం. వేసవి దృష్ట్యా నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టడం లాంటి చర్యలు చేపట్టానున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి లక్ష్యం తాండూర్ పట్టణాన్ని నీటి ఎద్దడి లేని పట్టణంగా తీర్చిదిద్దడమేనన్నారు. కాగ్న నది నుండి నీటి సరఫరాను క్రమబద్ధీకరించేందుకు అన్ని వనరులను సమకూర్చుకుంటున్నామన్నరు. ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపే వరకు విశ్రమించం, అని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.



