- మృతదేహం పై దెబ్బలు
- గమనించి పోలీసులకు పిర్యాదు
- వ్యక్తి మృతిపై వీడని అనుమానాలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : బషీరాబాద్ మండలంలోని మైల్వార్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మరణం స్థానికంగా కలకలం రేపింది. సాధారణ మరణంగా భావించిన కుటుంబ సభ్యులు, అంత్యక్రియల సమయంలో మృతదేహంపై గాయాలను గుర్తించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.మైల్వార్ గ్రామానికి చెందిన తుళ్లప్ప (35) ఉపాధి నిమిత్తం హైదరాబాద్లోని చందానగర్లో కూలీ పనులు చేస్తూ నివసిస్తున్నాడు. అతనికి భార్య లక్ష్మి మరియు ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత ఆదివారం రాత్రి తన నివాసంలో భోజనం చేసి నిద్రపోయిన తుళ్లప్ప, సోమవారం ఉదయానికి శవమై కనిపించాడు. మరణానికి గల కారణాలు తెలియకపోయినా, ప్రాథమికంగా సాధారణ మరణంగా భావించిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామమైన మైల్వార్కు తరలించారు. మంగళవారం అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేసి, మృతదేహానికి స్నానం చేయిస్తున్న సమయంలో తల మరియు శరీర భాగాలపై లోతైన గాయాలు ఉండటాన్ని బంధువులు గమనించారు. దీంతో ఇది సహజ మరణం కాదని, ఎవరో హత్య చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తూ అంత్యక్రియలను నిలిపివేశారు.కుటుంబ సభ్యుల సమాచారంతో బషీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినందున, తుళ్లప్ప తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్లు బషీరాబాద్ ఎస్సై శ్రీశైలం యాదవ్ పేర్కొన్నారు.



