IIT డిగ్రీ లేకుండానే 2.6 కోట్ల ఉద్యోగం..! కర్నాటక ఇంజనీర్ స్ఫూర్తిదాయక ప్రయాణం..!
మన దేశంలో గత కొన్నేళ్లుగా భారీ ప్యాకేజీలతో ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించాలంటే ఐఐటీ (IIT) చదువులు తప్పనిసరి అన్నట్లుగా పరిస్ధితి మారిపోయింది. అందుకే జాతీయ స్ధాయిలో ఏటా నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ( జేఈఈ)కి డిమాండ్ పెరుగుతూ పోతోంది. కానీ తాజాగా జేఈఈ అవసరం లేకుండానే అడ్మిషన్లు ఆఫర్ చేస్తూ ఐఐటీలు సంచలనం సృష్టిస్తుంటే, అసలు ఐఐటీలోనే చదవకుండా అమెరికాలోని కాలిఫోర్నియాలో అంతర్జాతీయ సంస్థ ఎన్విడియాలో ఓ కర్నాటక ఇంజనీర్ రూ.2.6 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించి సంచలనం రేపాడు.
భారీ ప్యాకేజీలు ఇచ్చే ఉద్యోగాలకు ఐఐటీయే అర్హత కాదని, నైపుణ్యాలు ఉంటే చాలని నిరూపించిన ఆ కర్నాటక ఇంజనీర్ పేరు పృధ్వీరాజ్. అతను తాజాగా కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో ఉన్న ఎన్విడియా (NVIDIA) ప్రధాన కార్యాలయంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ -డీప్ లెర్నింగ్గా గా చేరినట్లు లింక్డ్ఇన్లో వెల్లడించాడు. మన దేశంలో అగ్రశ్రేణి విద్యాసంస్థల నుండి డిగ్రీలు సంపాదిస్తేనే విజయం సాధ్యమని నమ్మే వేలాది మంది విద్యార్థులకు అతని ప్రయాణం ఆ భావన తప్పని నిరూపించింది.

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని కటందేవరకోట గ్రామానికి చెందిన పృథ్వీరాజ్ .. టెక్నాలజీ, ఉన్నత విద్యా అవకాశాలు చాలా పరిమితంగా ఉండే ప్రాంతంలో, ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగాడు. అతని తండ్రి ఓ బ్యాంకు ఉద్యోగి. పృథ్వీరాజ్ ఐఐటి లేదా మరే ఇతర ఉన్నత ఇంజనీరింగ్ సంస్థ నుండి పట్టభద్రుడు కాలేదు. బెంగళూరులోని పిఇఎస్ (PES) యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్లో నైపుణ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టాడు.
ఇప్పుడు అంతర్జాతీయ సంస్ధలో ఉద్యోగం సంపాదించి.. ఒక చిన్న పట్టణంలో ఒక నిశ్శబ్ద కలగా మొదలైనది ఇప్పుడు నిజమైంది అంటూ లింక్డ్ ఇన్ లో తన సంతోషం పంచుకున్నాడు.

అనేక ఎదురుదెబ్బలు, ఆత్మసందేహ క్షణాలు ఎదురైనా, తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు పృధ్వీరాజ్ వెల్లడించాడు. ఖరీదైన కోచింగ్ లేదా కాలేజ్ బ్రాండింగ్ పై ఆధారపడకుండా, ఆన్లైన్ కోర్సులు, వ్యక్తిగత ప్రాజెక్టులు, నిరంతర సాధన ద్వారా ఏఐ, డీప్ లెర్నింగ్ను నేర్చుకోవడానికి సంవత్సరాలు గడిపాడు. అదే ఇప్పుడు అతనికి రూ.2.6 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం తెచ్చిపెట్టింది.

