- పార్టీలకతీతంగా కదలండి!
- తాండూర్ ప్రతిష్టను కాపాడుకోవాల్సిన సమయం ఇది..
- యాలాల, పెద్దేముల్, బషీరాబాద్ మండలల్లో అవగాహన ర్యాలీలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : ఇది రాజకీయాలు చేసే సమయం కాదు.. తాండూర్ ఆత్మగౌరవాన్ని, ప్రతిష్టను కాపాడుకోవాల్సిన సమయం” అని ప్రజా ప్రతినిధులు, మేధావులు, యువత పిలుపునిచ్చారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాం హౌస్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో, తాండూర్ ప్రతిష్ట దిగజారిపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండల కేంద్రాల్లో డ్రగ్స్ నివారణకై అవగాహన ర్యాలీలు నిర్వహించారు.ర్యాలీ అనంతరం నాయకులు మాట్లాడుతూ, గత ఐదు సంవత్సరాలుగా తాండూర్ ప్రాంతంలో డ్రగ్స్ మాఫియా యథేచ్ఛగా సాగుతోందని విమర్శించారు. అధికార పార్టీ అండదండలతో కొందరు నాయకులు కేవలం డ్రగ్స్ వాడటమే కాకుండా, సరఫరాదారులుగా (సప్లయర్స్) మారి యువత జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. గతంలోనూ తాండూర్ సమీపంలోని ఫాం హౌస్లలో ఇలాంటి పార్టీలు ఎన్నో జరిగాయని, వాటి వల్ల ఎంతోమంది యువకులు రోడ్డున పడి ప్రాణాలు, జీవితాలను నాశనం చేసుకున్నారని గుర్తుచేశారు.మత్తు పదార్థాల బారిన పడకుండా పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందని వక్తలు పేర్కొన్నారు. మేధావి వర్గం సోషల్ మీడియా వేదికగా యాంటీ డ్రగ్స్ మూమెంట్’ ను ఉధృతం చేయాలని, యువతలో చైతన్యం తీసుకురావాలని కోరారు. రాజకీయాలను పక్కనపెట్టి, డ్రగ్స్ సంస్కృతిని ప్రోత్సహిస్తున్న వారికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు సురేందర్ రెడ్డి, అక్బర్ బాబా, భీమప్ప, హనుమంతు, శ్రీధర్, వీరేశం తో పాటు పెద్ద సంఖ్యలో విద్యావంతులు, యువకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.



