- అంతరం ఎస్సీ స్మశాన వాటిక వద్ద ప్రమాదం
- ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచిన కిష్టప్ప
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
జనవాహిని ప్రతినిధి తాండూరు : చెత్త తరలించే ఓ ప్రైవేట్ టాటా ఏసీ ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఓ రైతు దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాదకర సంఘటన తాండూరు మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… అంతరం గ్రామానికి చెందిన రైతు తాండ్ర కిష్టప్ప పని నిమిత్తం కాలినడకన తాండూరుకు వస్తున్నాడు.అదే సమయంలో చెత్త డంపింగ్ యార్డ్ నుండి తాండూరు వైపు వస్తున్న మున్సిపల్ చెత్త ఆటో (నెం. 16 27) అంతరం గ్రామానికి చెందిన ఎస్సీ స్మశాన వాటిక సమీపంలోకి రాగానే కిష్టప్పను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిష్టప్పకు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ దారి గుండా వెళ్తున్న మృతుడి బంధువు తాండ్ర వెంకటప్ప ప్రమాదాన్ని గమనించి వెంటనే అక్కడికి చేరుకున్నాడు.అప్పటికే ఆటో డ్రైవర్ 108 అంబులెన్స్కు సమాచారం అందించాడు. క్షతగాత్రుడిని కుటుంబ సభ్యుల సహాయంతో వెంటనే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు కిష్టప్ప అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. చేత్త ఆటో ను నడిపిన నాగరాజు కు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న తాండూరు సీఐ, ఎస్ఐలు త్వరితగతిన సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. అనంతరం సీఐ ఈ ఘటనపై జిల్లా ఎస్పీకి ప్రాథమిక సమాచారాన్ని అందించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. ఈ ప్రమాదంపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.